UP Crime: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన అత్యాచార చట్టాలు, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల్లో భయం కలగడం లేదు. ఇటీవల కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేశారు. మహిళల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు రావాలని కోరారు.
Read Also: Vijayawada: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం
ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లయిన మహిళపై ఇంట్లోనే అత్యాచారం జరిగింది. భాదోహిలో 20 ఏళ్ల మహిళపై రాహుల్(28)అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం మహిళ భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ ముందుగా సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో డబ్బులు కూడా ఎరగా చూపాడని, ఆమె ప్రతిఘటించడంతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఇన్స్పెక్టర్ సచ్చిదానంద్ పాండే తెలిపారు.
భర్త తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని అతడికి వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64[1] (రేప్), 351[2] (నేరపూరిత బెదిరింపు) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.