Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

  • నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
  • యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
  • తన కూతురు జీవితం నాశనమైందని ఆవేదన..
Up News

Up News

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సెవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తెను మోసగాడితో పెళ్లి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు నకిలీ గుర్తింపు, పేర్లతో చాలా మంది మహిళల్ని మోసం చేశాడని ఆరోపించాడు. దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని అన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుజ్ త్రివేది, అతడి కుమారుడు ప్రకర్ త్రివేదిలను అరెస్ట్ చేశారు.

తన కుమార్తె ప్రగ్యాకు మిశ్రిఖ్ ప్రాంతానికి చెందిన ప్రకర్ త్రివేదితో 2024లో వివాహం జరిపించానని, ఆ సమయంలో అనుజ్ తాను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పుకున్నాడని, తన గత నేర చరిత్ర, కేసుల్ని దాచిపెట్టాడని ఎమ్మెల్యే ఆరోపించాడు. వివాహ సమయంలో చాలా మందిని ఈ కుటుంబం గురించి అడిగామని, చాలా మంది ప్రభావవంతమైన వ్యక్తులు వారి గురించి మంచి సమాచారం ఇవ్వడంతోనే పెళ్లికి అంగీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, పెళ్లయిన రెండున్నరేళ్ల తర్వాత సోషల్ మీడియా, ఇతరుల ద్వారా ప్రకర్ త్రివేది వ్యవహారాలు తమ కుటుంబానికి తెలిసినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ప్రకర్ త్రివేది వేర్వేరు రాష్ట్రాల్లో పలువురు మహిళల్ని నకిలీ గుర్తింపుతో మోసం చేశాడని, వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు మోసం చేసినట్లు జ్ఞాన్ తివారీ ఆరోపించారు. అతడు దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత నిందితుడి కుటుంబంతో అన్ని సంబంధాలను తెచుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని, ఇది తన ప్రతిష్టకు భంగం కలిగించిందని అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనుజ్ త్రివేది దోషిగా తేలితే మరణశిక్ష విధించాలని, తన అల్లుడు కూడా నేరం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.