సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి గుజరాత్లో వెలుగుచూసిన ఒక దారుణ ఘటనే నిదర్శనం. కేవలం ఇంటి అద్దె బకాయిలను చెల్లించలేక, ఒక కన్నతండ్రే తన భార్య, మైనర్ కూతురిని ఇంటి యజమాని లైంగిక వేధింపులకు గురిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. నమ్మకానికి, రక్షణకు మారుపేరుగా నిలవాల్సిన భర్త, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన ఈ హేయమైన చర్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్లోని సురేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం సుమారు ఆరు నెలల క్రితం ఉపాధి వెతుక్కుంటూ మోర్బి నగరానికి వలస వచ్చింది. అక్కడ వారు నెలకు రూ. 2,000 అద్దెతో ఒక ఇంట్లో నివాసం ఉండటం ప్రారంభించారు. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం గత నాలుగు నెలలుగా ఇంటి అద్దెను చెల్లించలేకపోయింది. దీంతో అద్దె బకాయిలు పేరుకుపోయాయి.
అద్దె డబ్బులు ఎలా కట్టాలో తెలియని తరుణంలో.. ఆ వ్యక్తి మానవత్వాన్ని మరిచి ఒక వికృతమైన ఆలోచన చేశాడు. పేరుకుపోయిన అద్దె బకాయిలకు బదులుగా, తన భార్య మరియు మైనర్ కుమార్తెపై లైంగిక దాడి చేయడానికి ఇంటి యజమానికి అనుమతిస్తూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి యజమాని వారిద్దరిపై పలుమార్లు లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కేసు నమోదు..
బాధిత మహిళ ఈ విషయాన్ని తన తల్లికి వివరించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న మహిళ తల్లి వెంటనే మోర్బి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తీవ్రతను గమనించిన పోలీసులు నిందితులపై కఠిన చట్టాలతో పాటు, మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు గానూ ‘పోక్సో’ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలిక తండ్రితో పాటు, ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోర్బి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె.ఎమ్. లాల్ మాట్లాడుతూ.. తండ్రి, యజమాని కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారించారు.
