Extra-marital relationship: త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. వివాహితకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవమానం తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. దుర్జోయ్నగర్లో ఈ ఘటన జరిగింది. మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను నిందితుడు సోషల్ మీడియాలో పెట్టడం, ఈ విషయం వివాహిత దృష్టికి రావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 5న మహిళ తన ఇంట్లో ఉరేసుకుని మరణించింది. ఈ ఘటనపై పోలీసులు మహిళ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా పలువురిని ప్రశ్నించారు. మహిళ తల్లిదండ్రుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు. మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. అయితే, మహిళ ఆ సంబంధం నుంచి బయటకు రావాలని ప్రయత్నించడంతో, దీంతో కోపం పెంచుకున్న నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాజంలో పరువు పోతుందని భావించిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మహిళ భర్త తన భార్య పరువు తీశాడని, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాడని నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.