నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్పూర్ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఎన్హెచ్ 33 నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో 2011లో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తొలుత రాంచీ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఒ) మొత్తం రూ.264 కోట్ల్ల నిధుల మళ్లింపు జరిగినట్లు తేల్చింది.
తాజాగా ఈ కేసులో మధుకాన్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరిట బ్యాంకు రుణాలు మళ్లించారని అభియోగాలను అధికారులు పేర్కొన్నారు. అయితే శ్రీనివాసరావు అరెస్టు తీరును తప్పు పట్టిన నాంపల్లి ఈడీ కోర్టు. సీఆర్ పీసీ 41ఏ ప్రకారం ఈడీ వ్యవహరించలేదని కోర్టు ఈడీ అధికారులను తప్పు పట్టింది. శ్రీనివాసరావుకు రిమాండ్ విధించేందుకు నిరాకరించిన ఈడీ కోర్టు. ఈడీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సవాల్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆర్థిక లావాదేవిలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
