Tattoo artist: మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ముర్తిజాపూర్ పట్టణంలో అస్సాంకు చెందిన 26 ఏళ్ల మహిళా టాటూయిస్ట్ తలకు గాయాలై మృతి చెందింది. ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన లవర్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
బాధిత మహిళను శాంతిక్రియా కశ్యప్ అలియస్ కోయెల్గా గుర్తించారు. జూలై 24న ముర్తిజాపూర్లోని ప్రతీక్ నగర్ ప్రాంతంలో ఆమె తన ఇంట్లో శవమై కనిపించింది. ఈ ఇంట్లోనే ప్రియుడు కునాల్ సన్నీ శృంగారే(30) కూడా నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శృంగారే అని, అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అస్సాంకు చెందిన కశ్యప్ గత ఆరేళ్లుగా తన తల్లితో కలిసి ఢిల్లీలో ఉంటూ టాటూ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె ముంబైలో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు.
Read Also: Atal Setu Bridge: ఏమైందో పాపం.. అటల్ సేతుపై నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య.. వీడియో వైరల్..
ప్రాథమిక విచారణ ప్రకారం.. కశ్యప్, శృంగారే సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఇటీవల కశ్యప్ని శృంగారే ముర్తిజాపూర్ కి పిలిచాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టాడు. దీని ప్రకారం ఆమె జూలై 21న అక్కడికి వెళ్లింది. స్థానికంగా ఉండే ఓ బార్లో వెయిటర్గా పనిచేస్తున్న శృంగారే, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని బార్కి తీసుకెళ్లాడు. నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉందని, జూలై 23 రాత్రి అతనికి, కశ్యప్ మధ్య వాగ్వాదం జ రిగి, ఆవేశంతో ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం, ఇరుగుపొరుగు వారు పోలీసులకు కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్యానంతరం శృంగారే పరారీలో ఉన్నాడు.