Son Killed Mother : తల్లిని చంపి డ్రమ్‌లో సిమెంట్‌తో కప్పేసిన కొడుకు..

Crime

Crime

చైన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి కొడుకు కన్నతల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్నైలోని నీలాంకరైలో సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్‌, షెన్బగం దంపతులు. అయితే వీరికి ముగ్గురు కుమారులున్నారు. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడు సురేష్‌తో కలిసి షెన్బగం ఉంటోంది. అయితే.. గత ఆదివారం సాయంత్రం షెన్బగం పెద్ద కొడుకు ప్రభు ఇంటి తల్లిని కలిసేందుకు వచ్చాడు. అయితే.. ఆ సమయంలో తల్లి కనిపించకపోయే సరికి.. తమ్ముడు సురేష్‌ను అడుగగా.. అమ్మలేదు బయటకు పోయిందంటూ సమాధానం ఇచ్చాడు.

సురేష్‌ మాటలపై అనుమానం వచ్చి ప్రభు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సురేష్‌ను తన తల్లి షెన్బగం గురించి ప్రశ్నించగా తల్లి చనిపోతే.. డ్రమ్‌లో పెట్టి.. సిమెంట్‌తో కప్పేశానని సమాధానం ఇచ్చాడు.. దీంతో ఖంగుతిన్న పోలీసులు ఆ డ్రమ్‌ను పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఈ ఘటన నీలాంగరైలో కలకలం రేపుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షెన్బగం కుమారుడు సురేష్‌ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతుండటం గమనార్హం.