Site icon NTV Telugu

హైదరాబాద్‌లో విషాదం.. కరోనా వచ్చిందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది.

Read Also: యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే?

వివరాల్లోకి వెళ్తే… భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్‌ కానాజీగూడలోని మానస సరోవర్‌ హైట్స్‌లో నివసిస్తోంది. ఈ నెల 21న అలేఖ్య అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ ఉందని తేలింది.

అప్పటి నుంచి అలేఖ్య ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులతో సైతం ఫోన్‌లో మాట్లాడింది. రెండు రోజుల అనంతరం ఈనెల 23వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అలేఖ్య నివాసానికి వచ్చి పరిశీలించగా.. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version