Drugs : సికింద్రాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఆపరేషన్లో పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు. బోయిన్పల్లిలోని మేధా హై స్కూల్ను మూసివేసి, దాని లోపలే డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గౌడ్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి. అతను స్కూల్ను మూసివేసి, పగటి పూటల్లో డ్రగ్స్ తయారీ చేయగా, సాయంత్రం మాత్రం ట్యూషన్ తరగతులు నడిపేవాడట. ఈ విధంగా ఎవరికి అనుమానం రాకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తెలిసింది.
ప్రమాదకరమైన ఆల్ఫా జోలం అనే మత్తుమందును స్కూల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మత్తుమందును నగరంలోని కల్లు కాంపౌండ్లకు, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. స్కూల్లోని మూడు అంతస్తుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నాలుగు రియాక్టర్ల సహాయంతో ఆల్ఫా జోలం తయారీ కొనసాగించారని అధికారులు తెలిపారు. ఇప్పటికే అక్కడి నుంచి 20 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
సమాచారం అందుకున్న ఈగల్ టీం ముందుగా గౌడ్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా 5 కిలోల ఆల్ఫా జోలం మత్తుమందు స్వాధీనం చేసింది. అనంతరం స్కూల్ లోపల నిర్వహించిన సోదాల్లో మరో 5 కిలోల ఆల్ఫా జోలం, నాలుగు రియాక్టర్లు, పలు రసాయనాలు, నగదు, తయారీకి సంబంధించిన పరికరాలు దొరికాయి.
అదే సమయంలో ఆల్ఫా జోలం తయారీలో పాల్గొంటున్న నలుగురు కార్మికులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని గౌడ్ స్కూల్ లోపలే ఉంచి డ్రగ్స్ తయారీలో ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బోయిన్పల్లి పరిసరాల్లో కలకలం రేగింది. స్కూల్ ముసుగులో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ జరగడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కేసులో గౌడ్తో పాటు మరికొందరు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఎంతవరకు విస్తరించిందో, ఎవరు ఇందులో భాగస్వాములయ్యారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసిన ఆల్ఫా జోలం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఆపరేషన్తో సికింద్రాబాద్ డ్రగ్ మాఫియాకు గట్టి దెబ్బ తగిలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
