Blackmail Case: ఒక వైద్యుడు, అతని ఆసుపత్రిలో పనిచేసిన నర్సు, రూ.2 కోట్ల బ్లాక్మెయిల్ ఆరోపణలు, ఇప్పుడు వందలాది మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు. రాజస్థాన్లోని బార్మర్లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట బ్లాక్మెయిల్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం, ఇప్పుడు పరస్పర ఆరోపణలతో మరింత సంక్లిష్టంగా మారింది. అయితే ప్రస్తుతం ఇరు పక్షాలు చేసిన ఆరోపణల్లో ఏదీ నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వ్యవహారం 65 ఏళ్ల ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. 2016 నుంచి తన ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు కమల తన వ్యక్తిగత ఫోటోలను మొబైల్ నుంచి కాపీ చేసి, వాటిని సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరిస్తూ సంవత్సరాలుగా డబ్బులు వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. తనపై తప్పుడు అత్యాచారం కేసు పెడతానని, ప్రాణహాని కలిగిస్తానని కూడా బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట, ఆసుపత్రి పేరును కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె కోరినట్లు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.
డాక్టర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నర్సును అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆమె మొబైల్ ఫోన్, బ్యాంకు లావాదేవీలు, ఈమెయిళ్లను పరిశీలిస్తున్నారు. ఫిర్యాదు ప్రకారం డాక్టర్ పర్సనల్ ఖాతాలు, ఆసుపత్రి ఖాతాల నుంచి దాదాపు రూ.35 లక్షలు ఆన్లైన్ ద్వారా బదిలీ అయ్యాయి. అంతేకాదు, ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుని వాటిని తన వద్ద ఉంచుకుందని కూడా వైద్యుడు ఆరోపించారు. మొత్తం మీద సుమారు రూ.2 కోట్ల వరకు బలవంతంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే కోర్టులో హాజరైన సమయంలో నర్సు చేసిన ఆరోపణలు కేసుకు మరో మలుపు తిప్పాయి. సంబంధిత డాక్టర్ను “సీరియల్ రేపిస్ట్”గా అభివర్ణిస్తూ, అతడు 100 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఆసుపత్రికి వచ్చిన మహిళా రోగులను కూడా వేధించేవాడని, గతంలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా డబ్బుతో ఆ వ్యవహారాలను ముగించుకున్నాడని పేర్కొంది. తనపై నమోదు చేసిన బ్లాక్మెయిల్ కేసు కూడా ఈ ఆరోపణలను అణిచివేయడానికేనని ఆమె వాదించింది.
ఈ ఆరోపణలు ప్రస్తుతం నర్సు చేసిన వాదనలు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదని, అధికారికంగా ధృవీకరణ జరగలేదని వెల్లడించారు. మరోవైపు నర్సు విచారణలో సహకరించడం లేదని, దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు.
దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. నిందితురాలు 2020లో బార్మర్ పంచాయతీ సమితి ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ తరఫున వార్డు అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 58 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు అధికారులు గుర్తించారు. 2010లో నర్సింగ్ పూర్తి చేసిన ఆమె, 2016లో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, గతంలో వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసు రెండు వేర్వేరు కోణాల్లో కొనసాగుతోంది. ఒకవైపు డాక్టర్ ఫిర్యాదు మేరకు బ్లాక్మెయిల్, దోపిడీ, నేరపూరిత బెదిరింపుల అంశాలపై విచారణ జరుగుతుండగా, మరోవైపు నర్సు చేసిన లైంగిక దాడుల ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కేసు వెలువడలేదు. అన్ని ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, సంబంధిత వాదనలను పరిశీలించిన తర్వాతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బార్మర్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో తుది నిజాలు దర్యాప్తు పూర్తయ్యాకే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

