Nuzvid Love Marriage Twist: ప్రేమించి పోలీస్స్టేషన్లో వివాహం చేసుకున్న యువకుడు.. అనంతరం తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో కలకలం రేపాయి. డబ్బులు చెల్లిస్తే యువతిని ఇంటి వద్దకు తీసుకొచ్చి అప్పగిస్తామని కొందరు వ్యక్తులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన యువతి రాజేశ్వరి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మధు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ మేజర్లేనని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజేశ్వరి ఏలూరులోని కాలేజీకి వెళ్లిన సమయంలో మధు స్నేహితులు నలుగురు ఆమెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ తర్వాత వీరవల్లి పోలీస్స్టేషన్లో మధు, రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహం అనంతరం వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తె ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలియకపోవడంతో రాజేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రూ.12 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణ
ఈ క్రమంలో మధు తరఫున కొందరు వ్యక్తులు తమకు ఫోన్ చేసి రూ.12 లక్షలు చెల్లిస్తేనే కుమార్తెను అప్పగిస్తామని చెప్పినట్లు రాజేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమపై ఎలాంటి కేసులు పెట్టకూడదని కూడా వారు షరతు విధించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డబ్బులు చెల్లిస్తే యువతిని ఇంటి ముందు దింపి వెళ్లిపోతామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. తమ కుమార్తెను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతో రూ.6 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు తెలిపారు. అయితే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా తమ కుమార్తెను నిజంగా అప్పగిస్తారో లేదో అనే అనుమానం కుటుంబ సభ్యుల్లో నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి ఈ విషయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న నూజివీడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు మధుతో పాటు అతడి స్నేహితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. యువతి ఆచూకీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
గతంలోనూ వేధింపులపై కేసు
మధు తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు. 2025 డిసెంబర్ 6న నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై Cr. No. 311/2025, సెక్షన్ 78(2) r/w 3(5) BNS కింద కేసు నమోదైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రేమ వివాహం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, డబ్బుల డిమాండ్ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

