Site icon NTV Telugu

Nepali Gang : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు..

Nepali Gang

Nepali Gang

హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జస్ట్ ఇంట్లో పని మనుషులుగా చేరడం.. కరెక్ట్‌గా రెక్కీ చేయడం.. ఆ తర్వాత ప్లాన్ పక్కాగా అమలు చేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం నేపాలీ గ్యాంగ్ స్టైల్. తాజాగా మరోసారి జూబ్లీహిల్స్‌లో పని చేసిన ఇంటికే కన్నం వేసింది నేపాలీ గ్యాంగ్. ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. పొట్ట చేత పట్టుకుని నేపాల్ నుంచి వచ్చాం.. పని ఇవ్వమని అడిగితే పని మనుషులుగా చేర్చుకున్నందుకు ఆ ఇంటికే ఎసరు పెట్టారు ఇద్దరు నేపాలీ దంపతులు.. ఇంటిలో 2 కోట్ల రూపాయల ఆభరణాలను భారీ చోరికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌-25లోని ప్లాట్‌ నెం.305లో పింగళి అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని ప్రసిద్ధ హోటల్‌ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు ఇంటికి తాళాలు వేసి ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్‌కు చెందిన మహేష్‌ షాయి, అప్సర దంపతులు పనిమనుషులుగా చేరారు…

Fastag Secrets : ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన కీలక అంశాలు

యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురు చూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి? నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు? వంటి వాటిపై క్షుణ్నంగా రెక్కీ నిర్వహించారు.. యజమానులు అనిరుధ్‌రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు తమ ప్లాన్ అమలు చేశారు. ముందుగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్‌ నెక్లెస్‌లు, 10 రోలెక్స్‌ వాచీలు, బంగారు నగలను బ్యాగ్‌లో సర్దుకుని ఉడాయించారు…

Sonia Gandhi vs Deve Gowda: సోనియాగాంధీకి మాజీ ప్రధాని లేఖ.. హాట్ టాపిక్‌గా అంశాలు

ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్‌ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్‌ సింగ్, రీమాసింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు… నేపాల్‌ సరిహద్దులతోపాటు ముంబై, బీహార్‌లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. 8 డైమండ్‌ నెక్లెస్‌లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్‌ వాచీలు విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు…

Exit mobile version