సమయస్ఫూర్తి, ధైర్యం ఉంటే ఎలాంటి ఆపద నుంచైనా గట్టెక్కవచ్చని మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. తుపాకులతో దోచేయడానికి వచ్చిన నలుగురు సాయుధ దొంగలను, ఒక నగల దుకాణంలోని సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్నారు. ఆయుధాలు ఉన్నాయనే భయం లేకుండా వారు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాల వల్ల భారీ దోపిడీ ప్రయత్నం విఫలమైంది. ఈ దృశ్యాలన్నీ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
దోపిడీ ప్రయత్నం..
పోలీసుల కథనం ప్రకారం.. నాసిక్లోని హిరావాడి ప్రాంతంలో ఉన్న ‘న్యూ సమృద్ధి జ్యువెలర్స్’ అనే నగల దుకాణంలోకి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. తమ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు వారు టోపీలు, మాస్కులు ధరించగా, ఒకడైతే ఏకంగా హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు. ఆ సమయంలో దుకాణంలో ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
On the night of May 15, at 9:30 PM, just as the staff was preparing to pull down the shutters of a jewellery store, six armed men barged into a shop located in the densely populated area of Hirawadi.
Pointing their guns at three staff members inside, they assaulted them,… https://t.co/HCFcjyoHfs pic.twitter.com/Oh7aOoGc2F
— Hate Detector 🔍 (@HateDetectors) May 16, 2026
దుకాణంలోకి రాగానే ఒక దొంగ తన వద్ద ఉన్న పిస్టల్ను తీసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపైకి గురిపెట్టి బెదిరించాడు. నగలు, నగదు ఇవ్వాలంటూ కేకలు వేశాడు. ఆ సమయంలో ఒక ఉద్యోగి భయంతో టేబుల్ కింద దాక్కునే ప్రయత్నం చేయగా, మిగిలిన ఇద్దరు ఉద్యోగులు మాత్రం అస్సలు భయపడలేదు.
సిబ్బంది వీరోచిత పోరాటం..
తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ఆ ఇద్దరు ఉద్యోగులు దొంగలను పట్టుకునేందుకు పోరాడారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఒక దొంగ.. తన చేతిలో ఉన్న పిస్టల్ వెనుక భాగంతో ఒక ఉద్యోగి తలపై బలంగా పదేపదే కొట్టాడు. దీనివల్ల ఆ ఉద్యోగి తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. అయినప్పటికీ సిబ్బంది వెనక్కి తగ్గకుండా పట్టు వదలకుండా పోరాడటంతో, దొంగలు బెంబేలెత్తిపోయారు. అక్కడ ఇక లాభం లేదనుకుని నగలు ఏమీ తీసుకోకుండానే ఖాళీ చేతులతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఈ సమాచారం అందుకున్న నాసిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఉద్యోగిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు, వారిని త్వరగా అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రాణాలను పణంగా పెట్టి యజమాని ఆస్తిని కాపాడిన సిబ్బందిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
