ప్రముఖ యూట్యూబర్స్ మధుకర్, ఆయన భార్య రమా నందనపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు. వాళ్లు వీసా పేరిట డబ్బు తీసుకుని మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే బాధితుడు చేసిన ఆరోపణలను రమా నందన ఖండించారు.
కపుల్స్ పేరు జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన. ఇలా చెబితే ఎవరైనా పెద్దగా గుర్తించరు. కానీ యూట్యూబ్లో నందూస్ వరల్డ్ పేరు చెబితే.. వీళ్లని ఇట్టే గుర్తు పట్టేస్తారు. యూట్యూబ్లో చాలా ఫేమ్ అయన వీరిద్దరి మీద ఇప్పుడు వీసా రిన్యువల్ పేరిట మోసం చేశారంటూ కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్.. తనను మోసం చేశారంటూ కేసు పెట్టారు.
యూకేలో వీసా గడువు ముగియడంతో.. శివక్రాంతి కుమార్.. దాన్ని రిన్యువల్ చేయించుకునేందుకు డెస్టినీ కన్సల్టెన్సీకి వెళ్లారు. ఈ కన్సల్టెన్సీకి డైరెక్టర్స్గా జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన ఉన్నారు. వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమ్లో ఉండడంతో వారి మాటలు నమ్మి.. వీసా రిన్యువల్ కోసం క్రాంతి కుమార్ దాదాపు రూ. 15 లక్షలు చెల్లించాడు. ఐతే నెలలు గడిచినా వీసా ప్రాసెస్ కాకపోవడం.. డబ్బుల గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించారు. భారత్లో ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.
నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, ఆమె భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది.
తాజాగా తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
