Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..

Loan

Loan

అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలి… కానీ ఆ దంపతులకు తీసుకోవడమే కానీ.. తిరిగి ఇవ్వడం అలవాటు లేదు.. అంతేకాదు.. అప్పు ఇచ్చిన వారు తిరిగి తమ డబ్బులు చెల్లించాలని అడిగితే వారికి చిర్రెత్తుకొస్తుంది. అలాంటి వారి అప్పు తీర్చడం కాదు.. కాదా ఏకంగా కాటికే పంపేస్తారు.. హత్య చేసి ఫామ్‌హౌజ్‌లో డెడ్‌బాడీలు పూడ్చి పెడతారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ జంట హత్యల కేసులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు.. వారు మరో 8 మందిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారన్న విషయం బయటపడడంతో పోలీసులే షాకవుతున్నారు.

యస్.. మీరు విన్నది కరెక్టే. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారు.. కేవలం తాము అప్పు ఇచ్చిన పాపానికి బలైపోయారు. ఈ ఫోటోలో ఉన్న మహిళల పేర్లు మహబూబ్ బీ, అబిదా బేగం. తాండూరు ప్రాంతానికి చెందిన వీరిద్దరూ ఏప్రిల్ 27న ఒకరు.. మే9న మరొకరు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బషీరాబాద్ పోలీసులు.. దర్యాప్తు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఇద్దరూ శవాలుగా తేలారు.

దీంతో ఈ కేసులో మిస్సింగ్ అంశం కాస్తా మర్డర్‌ కేసుగా మారింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వారే ఆ నిందితులు. ఇందులో ప్రధాన నిందితురాలు కరీమాబీ. ఆమె పక్కనే ఉన్న వ్యక్తి ఆమె భర్త.. మరో వ్యక్తి వారిద్దరికీ సహాయం చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కరీమాబీ దంపతులు పలువురి వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నారు. డబ్బులు అడిగిన వారిని మోసం చేసి ఫామ్ హౌస్‌కు పిలిపించి, రాత్రివేళల్లో దాడి చేసి హత్యలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే 8 మంది రుణదాతలను హత్య చేయాలని పథకం వేసినట్లు సమాచారం. అందులో భాగంగా మహబూబ్ బీ, అబిదా బేగంను చంపేశారు.

డబ్బులు ఇస్తామని చెప్పి రుణదాతలను మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్‌కు పిలిచేవారని పోలీసులు తెలిపారు. అక్కడ భోజనాలు పెట్టి రాత్రి వరకు ఉండాలని చెప్పి, వారు నిద్రలో ఉన్న సమయంలో దాడి చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. హత్య అనంతరం మృతదేహాలను ఎవరికి తెలియకుండా ఫామ్ హౌస్ సమీపంలో పూడ్చిపెట్టారని వెల్లడించారు.

దర్యాప్తులో అప్పుల లావాదేవీలపై అనుమానం వచ్చిన పోలీసులు నిందితులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఒత్తిడి తెచ్చినందుకు కోపంతో కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మొయినాబాద్ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు.. అటు కరీమాబీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆరుగురు మహిళలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. దీంతో మరికొంత మందిని కూడా హత్య చేయాలని పథకం వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.