Site icon NTV Telugu

Medipalli Thefts: మేడిపల్లిలో వరుస చోరీలతో వణుకుతున్న జనం.. 9 ఇళ్లు.. కోటి రూపాయల దోపిడీ!

Medipalli Thefts

Medipalli Thefts

Medipalli Thefts: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు స్థానికులకు దారుణంగా భయపెడుతున్నాయి. మొన్నటికి మొన్న సంక్రాతి వేళ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చాలా మంది సొంతూళ్లకు వెళ్లింది చూసి మరీ పంజా విసిరారు. అప్పట్లో ఏకంగా 9 ఇళ్లల్లో చోరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా మరో ఇంట్లో చోరీ చేసిన దొంగలు కేజీన్నర వెండి ఎత్తుకుపోయారు. రాత్రయిందంటే చాలు.. ఎటు నుంచి ఏ దొంగ వస్తాడో.. అనే కంటి మీద కునుకు లేకుండా భయంతో వణికిపోతున్నారు. ఇంటికి తాళం వేసి.. ఎక్కడికైనా వెళ్లాలంటే పలుమార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాదు ఇంట్లో విలువైన బంగారం, వెండి, నగదు ఉంచుకోవాలంటే కూడా ఆలోచిస్తున్నారు అక్కడి జనం.

READ ALSO: Hyderabad Hawala Racket: పాతబస్తీ అడ్డాగా హవాలా ‘చీకటి’ దందా.. కోడ్ భాషలో కోట్లు మార్పిడి!

ఈ ఏడాది తొలినాళ్ల నుంచి దోపిడీ దొంగలు మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకున్నారు. నెలలల వ్యవధిలో చెంగిచర్లలోని 9 ఇళ్లల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. అటు ప్రతాప సింగారంలోని 3 ఇళ్లతోపాటు మరో ఎలక్ట్రికల్ షాపులో చోరీ చేశారు. బోడుప్పల్‌లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో దొంగతనం చేశారు. ఈ చోరీ కేసుల ఇప్పటికీ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ దొంగలు మాత్రం మళ్లీ రెచ్చిపోయారు. తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NIN కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి చంద్రశేఖర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగులకొట్టి బీరువాలోని కేజిన్నర వెండి ఆభరణాలు, 6 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.

చంద్రశేఖర్ సతీమణికి ఆరోగ్యం బాగోలేక పోవడంతో సర్జరీకోసం ఆదివారం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటి పనిమనిషి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులకొట్టి ఉంది. చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో పని మనిషి… చంద్రశేఖర్‌కు సమాచారం ఇచ్చింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. గతంలో సంక్రాంతి వేళ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంటికి తాళాలు వేసి.. సొంతూళ్లకు వెళ్లిన వారి ఇళ్లు టార్గెట్ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు వరుసగా 9 ఇళ్లల్లో చోరీ చేశారు. మొత్తం 9 ఇళ్లలో కలిపి సుమారు కోటి రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు దుండగులు.

మేడిపల్లిలోని కనకదుర్గ కాలనీ, ఎన్ఎఫ్సీ కాలనీలో వరస ఇళ్లలో చోటుచేసుకున్న చోరీ ఘటన కలవరం రేపింది. తెల్లవారుజామున 2:30 గంటలకు భారీ చోరీ జరిగింది. చేతిలో టార్చ్ లైట్లు, ముఖానికి మాస్క్‌లు ధరించి.. చెంగిచెర్లలోని రెండు కాలనీలో సంచారం చేస్తూ దొంగలు చోరీకి తెగబడ్డారు. ముందే రెక్కీ చేసి కాలనీలో ఎంటర్ అయిన దొంగల ముఠా.. పలు ఇళ్లలో చోరీ చేసి బంగారం వెండి అభరాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. రెండు కాలనీల్లో చోరీలు జరిగిన తీరును పరిశీలించారు. మొత్తం 9 ఇళ్లలో చోరీలు జరిగినట్లు గుర్తించారు. అంతా కలిపి 30 తులాల బంగారం, 8కేజీల వెండి, రూ. 2 లక్షల నగదు చోరీకి గురైందని తెలిపారు. ఇలా వరుసగా చోరీలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. చోరీ కేసులను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చోరీ జరిగిన తర్వాత క్లూస్ టీమ్ అంటూ హడావుడి చేయడం తప్ప.. వారిని పట్టుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారని చెబుతున్నారు.

READ ALSO: Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్‌’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!

Exit mobile version