Site icon NTV Telugu

Student Suicide: జేఎన్‌టీయూ విద్యార్థిని ఆత్మహత్య.. ‘నేను చనిపోతేనే గొడవలు ఆగుతాయి’

Jntu Kakinada

Jntu Kakinada

Student Suicide: కాకినాడ జేఎన్‌టీయూలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమించిన వ్యక్తి తన వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని మానసిక వేదనతో యువతి సూసైడ్ చేసుకుంది. చిన్న వివాదం వలన రెండు ప్రాణాలు పోయాయి. మరోవైపు కుటుంబ సభ్యుల తొందరపాటు నిర్ణయాలు కూడా నిండు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామానికి అరుణ అనే యువతి కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పెట్రో కెమికల్ సెకండ్ ఇయర్ చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆమె తండ్రి రాము మూడేళ్ల కిందట చనిపోయాడు. అరుణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. పక్క గ్రామానికి చెందిన దానవేంద్ర అనే యువకుడితో అరుణకు పరిచయం ఏర్పడింది. చిన్న ఇంటర్నెట్ షాపు నడిపిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్స్ కూడా చేసేవాడు. అదే పరిచయం ఇప్పుడు ఈ ఘటనకు కారణమైంది.

READ ALSO: Ragi Halwa Recipe: నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ,హెల్తీ బెల్లం రాగి హల్వా..

అరుణ తల్లి కూతురికి డబ్బులు దానవేంద్ర ద్వారా పంపించేది అలా ఇద్దరు ఒకరి నెంబర్ ఒకరు షేర్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. కొద్దిరోజులు సరదాగానే గడిపారు. అయితే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం.. ఆ తర్వాత విషయం ఇంట్లో తెలియడంతో కొద్దిరోజులు దూరంగా ఉందామని అరుణ దానవేంద్రకు చెప్పింది. దానికి ముందు ఒప్పుకున్నప్పటికీ అరుణ ఫోటోలు దానవేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో మళ్లీ రచ్చ షురూ అయింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు.. దానవేంద్ర పై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది అరుణ. దాంతో దానవేంద్ర.. అరుణ తల్లిపై కోపం పెంచుకున్నాడు. ఇంటికి వెళ్లి ఆమెను కొట్టాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో దానవేంద్ర తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

దానవేంద్ర చనిపోయినప్పటి నుంచి గొడవలు మరింత ఎక్కువ అయ్యాయి. అతని కుటుంబ సభ్యులు అరుణ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వాళ్ల వల్లే దానవేంద్ర చనిపోయాడని తరచూ అనేవారు. దాంతో మరింత రచ్చయింది. ఈ వ్యవహారాలతో అరుణ మరింత డిస్టర్బ్ అయింది. కాలేజీకి వెళ్లినా కంఫర్ట్‌గా ఉండేది కాదు. అంతకుముందు గేమ్స్, ఇతర కల్చరల్ ఆక్టివిటీస్‌లో యాక్టివ్‌గా ఉండేది. కానీ దానవేంద్ర చనిపోయిన దగ్గర నుంచి పూర్తిగా మనస్థాపానికి గురైంది. మొత్తం ఈ గొడవలకు, దానవేంద్ర చావుకు తానే కారణమని భావించింది. ఆ సమయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. దానవేంద్ర లేకుండా తాను కూడా ఉండలేనని గత కొద్ది కాలంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. తాను చనిపోతే దానవేంద్ర దగ్గరికి వెళ్లిపోతానని, తన తల్లిని తమ్ముడిని కూడా ఎవరు ఏమనరని గొడవలు అన్ని సర్దుకుంటాయని సూసైడ్ చేసుకుంది. శివరాత్రి రోజు హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చనిపోయే సమయంలో.. అరుణ తన చావుకు సంబంధించి సూసైడ్ లెటర్ కూడా రాసింది.. పోలీసులు ఆ లెటర్ ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు అరుణ తల్లి మాత్రం.. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన చెందుతోంది. స్నేహితులు కూడా చనిపోయే రోజు ఉదయం కాల్ చేసి ఎగ్జామ్స్ గురించి మాట్లాడిందని గుర్తు చేసుకుంటున్నారామె. మొత్తానికి ప్రేమించిన వ్యక్తి చావుకు తాను కారణమని.. జరుగుతున్న గొడవలు చక్కబడాలంటే తాను ఈ లోకంలో ఉండకూడదని అరుణ నిర్ణయించుకుంది. సమస్యలకు దూరంగా పారిపోదామని బలవన్మరణం చేసుకుంది. గతంలో భర్త ఇప్పుడు కూతురు దూరం కావడంతో అరుణ తల్లి తల్లడిల్లపోతోంది.

READ ALSO: Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!

Exit mobile version