RTC Bus Stolen: అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్ర దొంగతనం కలకలం రేపింది. కదిరి ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన AP39 UX 7686 నంబర్ గల ఆర్టీసీ బస్సును శివశంకర్ అనే వ్యక్తి దొంగిలించి పరారయ్యాడు. ఆశ్చర్యకరంగా తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని కదిరి నుంచి మదనపల్లె వైపు బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. అయితే, మార్గమధ్యంలో శివశంకర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఇతర వాహనాలు, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదాల కారణంగా బస్సు ముందు అద్దాలు పగిలిపోగా, ఒకవైపు భాగం కూడా దెబ్బతింది.
అనంతరం మదనపల్లె జాతీయ రహదారిలోని తట్టివారిపల్లె బ్రిడ్జ్ వద్ద బస్సును రోడ్డుపైనే వదిలేసి అక్కడే ఉన్నాడు. స్థానికులు బస్సును గుర్తించి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శివశంకర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, బస్సును ఎందుకు దొంగిలించాడని పోలీసులు ప్రశ్నించగా, శివశంకర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బస్సు చోరీ వెనుక అసలు కారణాలను వెలికితీసే పనిలో ఉన్నారు. మొత్తంగా.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారైన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది..

