NTV Telugu Site icon

హెచ్అండ్ఎం బట్టల షోరూం క్లోజ్ ..నోటీసులు జారీచేసిన పోలీసులు

జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకోవడంతో ఆ షోరూంకి వెళ్ళాలంటేనే యువతులు భయపడుతున్నారు. ఈ షోరూంపై కేసు నమోదు కావడంతో హెచ్ అండ్ ఎం షోరూం క్లోజ్ చేశారు నిర్వాహకులు. ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు షోరూంకు చేరుకుని స్టోర్ మేనేజర్, ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఫోటోలు తీసిన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: దారుణం.. బట్టల షోరూమ్ ట్రయల్ రూంలో యువకుల ఫోటో షూట్

కాగా ఈ ఘటనపై సీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలను మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్‌ను అరెస్ట్ చేశామని, హెచ్అండ్ఎం షోరూంపైనా కేసు పెట్టినట్లు ఆయన తెలిపారు. లేడీస్ ట్రయల్ రూంలో సెల్‌ఫోన్‌ సహాయంతో పైనుంచి యువకులు వీడియో తీశారని, దీంతో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డేటా మొత్తం చెక్ చేస్తున్నట్లు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

ట్రైల్ రూమ్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు హెచ్ అండ్ ఎం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. షోరూమ్ సైన్ బోర్డులు కనబడకుండా తొలగించారు నిర్వాహకులు. లేడీస్, జెంట్స్ ట్రయల్ రూమ్స్ పక్కపక్కనే ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. లేడీస్ కి సపరేట్గా ట్రయల్ రూమ్స్ ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యం వలనే ఘటన జరిగిందంటున్నారు. ట్రయల్ రూమ్స్ పూర్తిగా క్లోజ్ చేసి ఉంచాలి. అవతలి వాళ్ళకు కనబడే విధంగా ఉండకూడదంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండేలా ట్రయల్ రూం ఏర్పాటు చేయడంతోనే ఇలాంటి ఘటన జరిగిందంటున్నారు.