చేసేది ఐటీ ఉద్యోగం.. కానీ ఆమె అమ్మేది మాత్రం మత్తుమందు. యువత ఈజీమనీ కోసం ఏ పనిచేయడానికైనా రెడీ అవుతున్నారు. యువకులు, ఐటీ నిపుణుల్లో గంజాయికి ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకొనేందుకు అరకు నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తుందో ఐటీ ఉద్యోగిని.
ఆ యువతి ఆటకట్టించారు పోలీసులు. ఐటీ ఉద్యోగం చేస్తున్న కొండపనేని మాన్సీ.. గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతడిని బోయిన్పల్లి పోలీసులు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేశారు. నాచారంలో ఉంటూ ఓ ఎంఎన్సీ(ఐటీ)లో పనిచేస్తున్న మాన్సీ.. భర్త మదన్ మనేకర్తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్పల్లి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 1.2 కిలోల గంజాయితో యువకులిద్దరూ చిక్కగా దంపతులు పారిపోయారు. వారిచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి వద్ద మాన్సీని పట్టుకున్నారు. ఏపీకి చెందిన ఆమె పూర్వీకులు నాగ్పుర్ జిల్లాలో వ్యవసాయంలో స్థిరపడ్డారు. భోపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా భర్తతో కలిసి ఉంటోందని ఏసీపీ నరేష్రెడ్డి తెలిపారు.
