IRS Officer Daughter Murder: ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కూతురుపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు రాహుల్ మీనా(19) అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గంటల వ్యవధిలో ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి రాహుల్ మీనా, తన పొరుగున ఉండే స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత ఢిల్లీకి చేరుకుని, ఐఆర్ఎస్ అధికారి కూతురుని రేప్ చేసి, హత్య చేశాడు.
అయితే, స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసేందుకు నిందితుడు రాహుల్ మీనా అబద్ధాలు చెప్పి, కుట్ర పన్నాడు. బాధిత మహిళ భర్త చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం తాను వేరే స్నేహితుడితో కలిసి పక్క ఊరిలో పెళ్లికి వెళ్లే సమయంలో నిందితుడు రాహుల్ మీనా కలిసి తాను కూడా వస్తానని పట్టుబట్టినట్లు చెప్పాడు. పెళ్లికి వెళ్లిన తర్వాత తనను ఇంటి వద్ద దించాలని నిందితుడు కోరాడని, అందుకు తాను ఒప్పుకోలేదని, భోజనం తర్వాత కలిసి వెళ్దామని చెప్పానని, అయితే రాహుల్ మీనా ఎలాగొలా గ్రామానికి చేరుకుని తన ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు.
తన ఇంటికి వెళ్లి డోర్ కొట్టగానే తన భార్య తాను వచ్చినట్లు భావించి తలుపు తెరిచిందని, భర్త పిలుస్తున్నాడని ఆమెతో రాహుల్ అబద్ధం చెప్పి, బయటకు రాగానే రాహుల్ బలవంతంగా వేరే గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించాడు. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో జరిగిందని, ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు పడుకున్నట్లు బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు.
ఘటన జరిగిన విషయాన్ని తన భార్య ఫోన్ ద్వారా వెల్లడించిందని చెప్పాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు రాహుల్ మీనా పారిపోయాడు. అల్వార్ నుంచి ఢిల్లీకి చేరుకున్న రాహుల్ మీనా గతంలో తాను పనిచేసి మానేసిన ఐఆర్ఎస్ అధికారి ఇంటికి వెళ్లి ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.
