Site icon NTV Telugu

Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..! అమ్మాయిలకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు..

Hyderabad Police

Hyderabad Police

Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..!! అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా అమ్మాయిలు, యువతులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే నోటిఫికేషన్లు.. వాటికి ప్రతిస్పందిస్తే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా పరిచయాలను ఒక్కోసారి యువతుల జీవితాల్ని అత్యంత దారుణమైన ప్రమాదాల్లోకి నెడుతున్నాయని చెబుతున్నారు. సో.. బీ అలర్ట్ విత్ సోషల్ మీడియా అంటూ అప్రమత్తం చేస్తున్నారు. వాస్తవానికి.. ఈ మధ్య యువత.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో సైబర్ నేరగాళ్లు, ఆన్ లైన్ కేటుగాళ్లు, ఆకతాయిలకు ఇది వరంగా మారింది. యువతులు, అమ్మాయిలకు సైబర్ వేదికగానే వల విసురుతున్నారు. ఆ తర్వాత వారిని మోసం చేయడం, బెదిరించడం తద్వారా యువతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సో.. కీప్ ఏ సోషల్ డిస్టన్స్ టు సోషల్ మీడియా అంటున్నారు పోలీసులు..

READ MORE: Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..

సోషల్ మీడియా వినియోగం పెరిగిన కొద్దీ అపరిచితులతో పరిచయాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిచయాలే కొందరు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి విషాదకర సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందమైన యువకుల ఫోటోలు, సినీ నటుల చిత్రాలను డీపీలుగా పెట్టుకుని ఫేక్ అకౌంట్లు సృష్టించి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు యువతులు వారిని నమ్మి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. అదే వారి జీవితాల్లో పెద్ద ప్రమాదానికి కారణమవుతోంది. ఆ తర్వాత ఆ అపరిచితులు రాక్షసుల్లా మారి ఆ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. డబ్బులు ఇవ్వాలని, కలవాలని బెదిరిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పరువు పోతుందనే భయంతో, కుటుంబ సభ్యులకు చెప్పలేక కొందరు యువతులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు అడిగినంత డబ్బులు ఇస్తూ బాధపడుతుంటే.. మరికొందరు ఈ వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్న దారుణ సంఘటనలు కూడా జరుగుతున్నాయి.

READ MORE: Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!

ఐతే ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అన్యాయం జరిగితే వెంటనే తల్లిదండ్రులు లేదా స్నేహితులకు చెప్పాలంటున్నారు. బ్లాక్‌మెయిల్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగ వద్దని చెబుతున్నారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడుపుతూ, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే తప్పించుకుంటామని నేరగాళ్లు భావించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడున్నా గుర్తించి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అప్రమత్తతే రక్షణ. అనుమానాస్పద పరిచయాల నుంచి దూరంగా ఉండటం, వ్యక్తిగత సమాచారం పంచుకోకపోవడం.. ప్రతి యువతి తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

Exit mobile version