Ganja Smuggling: ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని ప్యాక్ చేసి.. వాట్సాప్లో ఆర్డర్లు తీసుకుని.. కొరియర్, ర్యాపిడో ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్న కొత్త తరహా డ్రగ్స్ దందాను ఈగల్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై చేపట్టిన విస్తృత ఆపరేషన్లో భాగంగా హైదరాబాద్లోని బాలానగర్లో జరిగిన దాడులతో ఈ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ ఆర్డర్.. పేమెంట్ తరహాలో.. గంజాయి దందాకు కూడా టెక్నాలజీని వినియోగిస్తూ.. ఆర్డర్, పేమెంట్ కమ్ డెలివరీ అన్నీ చేసేస్తున్నారు. ఇదంతా వాట్సాప్లోనే జరుగుతోంది. ఇంట్లోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసిన విక్రయం. పైగా పోలీసుల దృష్టికి చిక్కకుండా ఉండేందుకు నిందితులు సరికొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ ఉంచి.. ఆ తర్వాత ఇంట్లోనే దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దందా హైదరాబాద్లోని బాలానగర్లో జరుగుతోంది.
గంజాయి వినియోగదారులతో దందా నడిపించే స్మగ్లర్లు ముందుగా వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. ముందుగా పేమెంట్ తీసుకుని.. కస్టమర్ లొకేషన్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ తర్వాత వారు ఉన్న ప్రాంతానికి గంజాయిని పంపిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దాడుల్లో బయటపడింది. ఒక్కోసారి.. ఇందుకోసం కొరియర్ సేవలతో పాటు ర్యాపిడో వంటి డెలివరీ మార్గాలను కూడా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో బాలానగర్లోని ఓ ఇంటిపై ఈగల్ ఫోర్స్, హెచ్-న్యూ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ సమయంలో నిందితులు అధికారులపై తిరగబడినట్లు అధికారులు తెలిపారు. సోదాలకు వచ్చిన అధికారులపైకి కుక్కలను వదిలి భయపెట్టే ప్రయత్నం చేయడంతో పాటు.. ఓ ఇన్స్పెక్టర్పై కత్తితో దాడి చేయడంతో ఆయన చేతికి గాయమైంది. మరో వ్యక్తి అధికారుల నుంచి తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ సోదాల్లో 14.5 కిలోల గంజాయితో పాటు ఓ ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా దందా చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములు.. ఓ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అనే ముగ్గురు అన్నదమ్ములుగా గుర్తించారు. వారితో పాటు కిరణ్ భార్యను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటినే గంజాయి ప్యాకింగ్, డెలివరీ కేంద్రంగా మార్చుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఈగల్ ఫోర్స్ విస్తృత ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటివరకు 69 మంది డ్రగ్ స్మగ్లర్లను, 49 మంది డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోనే స్మగ్లర్లు, వినియోగదారులపై పెద్ద ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయి. స్మగ్లర్ నుంచి వినియోగదారుడి వరకు.. మధ్యలో వాట్సాప్ నుంచి డెలివరీ బాయ్ వరకు.. డ్రగ్స్ దందా కొత్త రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ కీలకంగా మారింది.

