Khaja Mohijuddin: హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఇప్పటికే గుర్తించారు దర్యాప్తు అధికారులు. మొత్తం నలుగురు మొహిజుద్దీన్ హత్య కేసులో పాల్గొన్నట్లు నిర్థారించుకున్నారు. నలుగురిలో ప్రస్తుతం ఒకరు పోలీసుల అదుపులో ఉండగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. న్యాయవాది హత్యకు గల ప్రధాన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య.. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. మే 22న ఇంటి నుంచి బయటికి వచ్చి.. కారు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న మొహిజుద్దీన్ను అత్యంత సమీపం నుంచి కారుతో ఢీకొట్టి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. తీవ్ర గాయాలపాలైన మొహిజుద్దీన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో న్యాయవాదిని హత్య చేసిన ఘటన హైదరాబాద్లో తీవ్ర దుమారం రేపింది. న్యాయవాది మొహిజుద్దీన్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపారు.
వక్ఫ్ బోర్డుకు చెందిన భూముల వ్యవహారంలో న్యాయపోరాటం చేయడమే.. మొహిజుద్దీన్ హత్యకు కారణంగా అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు అనుమానితులపై ఫిర్యాదు చేయడంతో.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజీ కీలకంగా మారింది. ఆ ఫుటేజీ ఆధారంగా న్యాయవాది మొహిజుద్దీన్ హత్యలో నలుగురు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా కారును నడిపిన వ్యక్తి వినయ్గా గుర్తించారు. సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లుగా నిర్థారించుకున్నారు.
కిషన్ సింగ్ అనే వ్యక్తి అభిజీత్ను కలిశాడు. సుపారీ కుదుర్చుకొని.. యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్లాన్ చేశారు. ప్లాన్లో భాగంగా సెకండ్ హ్యాండ్లో స్కార్పియో కారును కొనుగోలు చేశారు దుండగులు. ఆ కారు సహాయంతోనే మొహిజుద్దీన్ను హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిని అభిజిత్గా గుర్తించిన పోలీసులు.. కిషన్ సింగ్తో పాటు వినయ్, నానీలు అతనికి సాయం చేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటికే వినయ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న కిషన్సింగ్, అభిజిత్, నానీల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
న్యాయవాది మొహిజుద్దీన్ హత్య వెనక ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారం పై విభేదాలు ఉన్నాయని.. అవే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. సుపారీ కిలర్స్ కోసం తన దగ్గర పనిచేస్తున్న కిషన్ సింగ్ సహాయం తీసుకున్నాడని.. ఏడాదిన్నరగా న్యాయవాది హత్యకు స్కెచ్ వేసినట్లుగా భావిస్తున్నారు దర్యాప్తు అధికారులు. స్టంట్స్ చేయడంలో నేర్పరైన అభిజిత్ సహాయంతో హత్యకు స్కెచ్ వేసినట్లు ఇప్పటి వరకు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే వినయ్ అదుపులో ఉన్నప్పటికి, అభిజిత్, కిషన్ సింగ్లు పోలీసులకు చిక్కితే అసలు సూత్రధారి ఎవరనేది తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అసలు హత్యకు కారణమేంటనేది తెలియనుంది.
