NTV Telugu Site icon

AP Crime: బిస్కెట్ల ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం..! ఆపై హత్య..

Minor Rape

Minor Rape

AP Crime: గంజాయి మత్తులో ఓ యువకుడు మృగమయ్యాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి.. అఘాయిత్యం చేసి.. ఆ తర్వాత ఆ చిన్నారిని హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం జరిగింది. బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు. ఆ దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బీహార్ కు చెందిన దిలీప్(20) బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి.. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read Also: Cricket Viral Video: దురదృష్టం వెక్కిరిస్తే ఇలానే ఉంటుంది మరి.. క్రికెట్ హిస్టరీలో అన్‌లక్కీ ఔట్!

ఇక, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలు గమనించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దిలీప్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. గంజాయి మత్తులో నిందితుడు బాలికపై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం రాత్రి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు.