NTV Telugu Site icon

Delhi Doctor Murder: ‘‘డాక్టర్‌ని చంపితే కూతురినిచ్చి పెళ్లి చేస్తా’’.. మర్డర్ కేసులో సంచలన విషయాలు..

Delhi Doctor Murder

Delhi Doctor Murder

Delhi Doctor Murder: ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా నర్సుగా పనిచేస్తున్న తన భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భర్త, ప్లాన్ ప్రకారం మైనర్లతో డాక్టర్‌ని హత్య చేయించాడు. ఇందులో సంచలన విషయం ఏంటంటే.. నిందితుల్లో ఒకరైన మైనర్‌కి తన కూతురిని ఇచ్చి వివాహం చేయిస్తానని మహిళా నర్సు భర్త హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో 55 ఏళ్ల యునానీ వైద్యుడిని హత్య చేయడానికి నర్సు భర్త మైనర్ నిందితులను నియమించుకున్నాడు. అనుమానిత నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సందర్భంలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 17 ఏళ్ల నిందితుడు మహిళా నర్సు కూతురితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయం తెలిసిన నర్సు భర్త.. డాక్టర్‌ని చంపితే తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని హామీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Harsh Goenka: “భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు?”

మైనర్లు ఇద్దరు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది. నేరానికి ఉపయోగించి ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి ఇద్దరు నిందితులలో ఒకరికి కాలికి గాయం చేసుకుని డ్రెస్సింగ్ చేయాల్సిందిగా యునానీ డాక్టర్ జావేద్ అక్తర్ ఆస్పత్రికి వద్దకు వచ్చారు. డ్రెస్సింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ రాయించుకునేందుకు డాక్టర్ అక్తర్ క్యాబిన్‌కి వెళ్లారు. ఆ సమయంలో డాక్టర్ క్యాబిన్ నుంచి తుపాకీ శబ్ధాలు వినిపించాయి. సిబ్బంది లోపలికి వెళ్లి చూసేసరికి డాక్టర్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. ఘటనకు పాల్పడిన తర్వాత ఇద్దరు నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత నిందితుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. “ఫస్ట్ మర్డర్ ఆఫ్ 2024” కామెంట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మహిళా నర్సు మరియు ఆమె భర్తను పోలీసులు విచారిస్తున్నారు.