Hyderabad Cyber Fraud: మాయ మాటలు చెప్పి ఓ కిలేడి డాక్టర్ను మాయ చేసి, ఏకంగా ఆయన సొంత ఇంటిని అమ్మించి రూ.14 కోట్లు కొల్లగొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. హైదరాబాద్కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఈ కిలేడి ఏకంగా రూ.14 కోట్లు కొట్టేసింది. ఈ కిలేడి ముఠా తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్ను బురిడీ కొట్టించి, రూ.14 కోట్లు స్వాహా చేశారు.
ముందుగా సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ని బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన కిలేడి ఆ డాక్టర్కు మెసేజ్ పెట్టి ట్రాప్ చేయడం స్టార్ట్ చేసింది. డాక్టర్ అందమైన అమ్మాయి ఫోటోల చూసి చాటింగ్ మొదలుపెట్టాడు. ఇదే అదనుగా ఈ కిలేడి చెలరేగి పోయింది.. తాను ఒక ఒంటరి మహిళని, స్టాక్ మార్కెట్కు సంబంధించిన కంపెనీలో పని చేస్తానని డాక్టర్కు పరిచయం చేసుకుంది.
ఈ క్రమంలో డాక్టర్కు స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ ద్వారా పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. అందమైన అమ్మాయి చెబుతుందని అనుకున్నాడో, లేదంటే లాభాలకు అత్యాశకు పోయాడో కానీ ఆ డాక్టర్ ఈ కిలేడీని నమ్ముకుని సొంత ఇల్లును అమ్మి రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డాక్టర్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ కిలేడి ముఠా ప్లేటు ఫిరాయించింది. దీంతో మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు డాక్టర్ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.. మోసపోయిన డాక్టర్ను సైబర్ కేటుగాళ్లు కంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు తెలిపారు. కంబోడియాలో తిష్ట వేసిన చైనా దేశస్థులు ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని చెప్పారు. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని వెల్లడించారు. చైనీయులు మన దేశం వాళ్లతోనే ఇక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసు విచారణలో కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు mule అకౌంట్స్ అందించిన నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు mule అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు గుర్తించినట్లు తెలిపారు.
READ ALSO: Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
