Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై కక్ష కట్టారు యువతి కుటుంబ సభ్యులు. జస్ట్ పెళ్లి చేసుకున్న రెండు రోజులకే మాయమాటలతో యువతిని నమ్మించారు. యువకుడిని అంతమొందించాలని పక్కా స్కెచ్చేశారు. మాట్లాడుదామని పిలిపించి, కత్తులతో యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని నేరెడ్మెట్ కు చెందిన అజయ్.. భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని రామలింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. రెండేళ్ల క్రితం కీసరగుట్ట వద్ద ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. పీకల లోతు ప్రేమలో మునిగిపోయిన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అందరు పేరెంట్స్ తరహాలోనే యువతి తల్లిదండ్రులు వాళ్ల పెళ్లికి నిరాకరించారు. మరోవైపు అజయ్ ఇంట్లో పెళ్లికి సరేనన్నారు. దీంతో అజయ్.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక తాను పెళ్లి చేసుకున్నట్లు యువతి.. తన కుటుంబ సభ్యులకు తెలిపింది.
యువతి పేరెంట్స్కు ఈ విషయం మింగుడు పడలేదు. అయినప్పటికీ చేసేదేం లేక అజయ్ ఇంటికి వచ్చారు కుటుంబ సభ్యులు. యువతికి మాయ మాటలు చెప్పారు. ఆమెను మభ్య పెట్టి.. బెదిరించి, బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పెళ్లితో తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు.. భారీ స్కెచ్ వేశారు. ఏకంగా అజయ్ని అంతమొందించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో యువతి ఫోన్ లాగేసుకున్న కుటుంబ సభ్యులు.. అజయ్తో నేరుగా చాటింగ్ చేశారు. రామలింగంపల్లికి రావాలని సూచించారు. దీంతో తన భార్యే తనను రమ్మంటుందని భావించిన అజయ్.. తెల్లవారు జామున రామలింగంపల్లికి బయల్దేరాడు. అప్పటికే అజయ్ని చంపడానికి ప్లాన్ వేసుకొని గ్రామ శివార్లలో సిద్ధంగా ఉన్నారు యువతి కుటుంబ సభ్యులు. అజయ్.. రామలింగంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చిన వెంటనే అతని కళ్లలో కారం కొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
యువతి పేరెంట్స్ చేసిన దాడిలో అజయ్ శరీరంపై దాదాపు 14 కత్తి పోట్లు పడ్డాయి. దీంతో అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అజయ్.. చనిపోయాడని భావించిన యువతి కుటుంబ సభ్యులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని, రక్తపు మడుగులో పడి ఉన్న అజయ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ తమ కుటుంబ సభ్యులు అజయ్పై ఇలా దాడి చేస్తారని ఊహించలేదని అంటోంది యువతి.
T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
అజయ్ని పిలిచి దాడి చేస్తారని అనుకోలేదని అతని సోదరుడు చెబుతున్నాడు. ఒకవేళ పిలిచినా మాట్లాడి పంపిస్తారని అనుకున్నట్లు తెలిపాడు. తన తమ్ముడికి న్యాయం జరగాలని కోరాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో అజయ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. అజయ్కి సపర్యలు చేస్తోంది. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన బొమ్మలరామారం పోలీసులు.. 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
