Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!

Chittoor Horror

Chittoor Horror

Chittoor Horror: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ తల్లి తన ఏడేళ్ల కుమారుడిపై ప్రియుడితో కలిసి అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలతో పాటు ప్రైవేట్ భాగంలో కూడా బ్లేడ్‌తో గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వీకోట ఈశ్వర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. అనంతరం ఎర్రచేనుకు చెందిన రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ సంబంధానికి తన కుమారుడు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. ప్రియుడు రాజుతో కలిసి బాలుడిని తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాలుడిని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, బ్లేడ్‌తో శరీరంపై గాయాలు చేశారు.. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా, బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.. బాలుడి శరీరంపై మొత్తం గాయాలు ఉండగా.. ప్రైవేట్‌ భాగాలను కూడా బ్లేడ్‌తో గాయపర్చడం కలకలం రేపుతోంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాలుడిపై జరిగిన దాడికి గల కారణాలు, ఆరోపణల నిజానిజాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.