బెంగళూరులోని క్యాప్జెమిని టెక్నాలజీ పార్క్ క్యాంపస్ లోపల ఉన్న డేకేర్ సెంటర్లో చిన్న పిల్లలపై జరిగిన వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ అమానుషాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన విజిల్బ్లోయర్ (మహిళా ఉద్యోగిని)ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది..?
సదరు మహిళ డేకేర్ సెంటర్లో జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన సున్నితమైన వీడియోలను లీక్ చేసి, సర్క్యులేట్ చేసిందనే ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు రోజు ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లగా, పోలీసులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. ఆమెను సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ఆమె కుటుంబ సభ్యులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ మహిళ షేర్ చేసిన వీడియోలు అత్యంత భయానకంగా ఉన్నాయి. కేవలం రెండేళ్ల వయసున్న పసిపిల్లలను ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ డ్రమ్ లోపల కూర్చోబెట్టి, కేర్టేకర్లు వారిపై వాటర్ జెట్ స్ప్రేతో నీళ్లు చల్లడం కనిపించింది. చిన్న పిల్లలను క్రూరంగా బాత్రూమ్లలో వేసి తాళాలు పెట్టడం వంటి దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ దారుణాన్ని బయటపెట్టిన కొద్దిసేపటికే డేకేర్ యాజమాన్యం ఆ విజిల్బ్లోయర్ను ఉద్యోగం నుండి తొలగించింది. పోలీసులు ఈ కేసులో విజయలక్ష్మి, మంజుల అనే ఇద్దరు మహిళా కేర్టేకర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్యాప్జెమిని ఈ ఘటనపై స్పందిస్తూ, తమ ఉద్యోగుల, వారి కుటుంబాల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. అధికారుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని పేర్కొంటూ, ప్రస్తుతం ఆ క్యాంపస్ లోని డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది.
ఈ డేకేర్లో సుమారు 50 నుంచి 60 మంది పిల్లలు నమోదు చేసుకోగా, నిత్యం 15 నుంచి 20 మంది పిల్లలు వచ్చేవారు. ఐటీ ఉద్యోగులు తమ పిల్లలను నమ్మి వదిలివెళ్తే.. అక్కడ కేర్టేకర్లు వారిని వేధించారని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెల్లడించారు.

