World Biggest Return: ఒకప్పుడు ప్రపంచ స్టాక్ మార్కెట్లంటే అమెరికా వాల్ స్ట్రీట్ మాత్రమే గుర్తుకు వచ్చేది. టెక్నాలజీ బూమ్ అంటే నాస్డాక్నే ప్రపంచం చూసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ రీడిఫైన్ చేస్తున్న సమయంలో ఆసియాలోని ఒక దేశం ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకుంది. అదే సౌత్ కొరియా. అక్కడి ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ అయిన కోస్పీ(KOSPI) ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల చరిత్రలోనే అత్యంత వేగంగా పరుగులు తీస్తున్న ఇండెక్స్లలో ఒకటిగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో పెట్టిన పెట్టుబడి దాదాపు రెట్టింపు అయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
బ్లూమ్బర్గ్ నివేదికల ప్రకారం 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు KOSPI దాదాపు 100 శాతం లాభం నమోదు చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సూచీ 5,000 స్థాయి నుంచి 8,000 మార్క్ను తాకడం ప్రపంచ మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం ట్రేడింగ్ సమయంలో ఒక్కరోజే 5 శాతం పైగా ఎగబాకిన ఈ సూచీ చివరికి 2.25 శాతం లాభంతో రికార్డు స్థాయిలో ముగిసింది. మార్కెట్లో పెట్టుబడిదారుల ఉత్సాహం ప్రస్తుతం డాట్కామ్ బబుల్ కాలాన్ని గుర్తు చేస్తున్నప్పటికీ ఈసారి కథ పూర్తిగా భిన్నమని నిపుణులు చెబుతున్నారు.
ఈ భారీ ర్యాలీ వెనుక అసలు శక్తి AI విప్లవం. ముఖ్యంగా ప్రపంచ సెమీకండక్టర్ రంగాన్ని ఆధిపత్యం చేస్తున్న రెండు దిగ్గజ సంస్థలు SK హైనిక్స్(Hynix),శామ్సంగ్ ఎలక్ట్రనిక్స్(Samsung Electronics) ఇప్పుడు ఈ బూమ్కు కేంద్రబిందువులుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ AI మోడళ్లు, హై పెర్ఫార్మెన్స్ సర్వర్ల వినియోగం పెరుగుతుండటంతో మెమరీ చిప్స్కు డిమాండ్ ఊహించని స్థాయికి చేరుకుంది. గతంలో చిప్ పరిశ్రమలో డిమాండ్ పెరిగి తగ్గే సైకిల్ ఉండేది. కానీ ఇప్పుడు AI యుగంలో డేటా వినియోగం నిరంతర ప్రక్రియగా మారిపోవడంతో ఈ డిమాండ్ దీర్ఘకాలికమవుతుందనే అంచనాలు బలపడుతున్నాయి.
1999 డాట్కామ్ బబుల్ సమయంలో అమెరికా నాస్డఖ్(Nasdaq) దాదాపు 102 శాతం పెరిగి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు KOSPI కూడా అదే స్థాయిలో రాబడులు ఇవ్వడంతో పోలికలు మొదలయ్యాయి. అయితే మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఊహాగానాలపై నడిచే బబుల్ కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పుల ప్రతిబింబమని చెబుతున్నారు. AI ఆధారిత భవిష్యత్తులో మెమరీ చిప్స్ కీలక వనరుగా మారడంతో కొరియా కంపెనీల ఆదాయాలు చాలా కాలం బలంగా కొనసాగవచ్చని భావిస్తున్నారు.
ఈ పరిణామం ప్రపంచ పెట్టుబడి ధోరణుల్లో కూడా పెద్ద మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టెక్ ర్యాలీలకు అమెరికానే కేంద్రంగా ఉండేది. ఇప్పుడు ఆసియా మార్కెట్లు కూడా AI బూమ్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సెమీకండక్టర్లు, AI ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాలు రాబోయే దశాబ్దంలో ప్రపంచ మార్కెట్ల దిశను నిర్ణయించే శక్తులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక భారతీయ పెట్టుబడిదారుల దృష్టిలో కూడా సౌత్ కొరియా మార్కెట్ ఇప్పుడు కొత్త అవకాశంగా మారుతోంది. నేరుగా కొరియా స్టాక్స్ కొనడం ఇప్పటికీ సులభం కాకపోయినా US మార్కెట్లో లిస్ట్ అయిన ETFల ద్వారా అక్కడి కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్, KYC, పాన్, ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత డాలర్ ఫండింగ్ ద్వారా ఈ ETFలను కొనుగోలు చేయవచ్చు. అయితే కరెన్సీ మార్పులు, డాలర్ తో పాటు కొరియన్ వోన్ హెచ్చుతగ్గులు, విదేశీ పెట్టుబడులపై పన్ను నిబంధనలు వంటి అంశాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే అడుగు వేయాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
