Sundar Pichai: భారత సంతతికి చెందిన గూగుల్ (Alphabet) సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కంపెనీ బోర్డు ఆయనకు ప్రకటించిన సరికొత్త జీతం ప్యాకేజీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే మూడేళ్ల కాలానికి గానూ పిచాయ్ ఏకంగా $692 మిలియన్లు (సుమారు రూ.6,400 కోట్లు) అందుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్ల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయనకు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చని అంటున్నారు. ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్యాకేజీ లెక్కలు ఇవే..
సుందర్ పిచాయ్ అందుకునే ఈ భారీ మొత్తంలో కేవలం నగదు మాత్రమే లేదు, మెజారిటీ భాగం స్టాక్ యూనిట్ల రూపంలో ఉంది. గూగుల్ సీఈఓకు ఏడాదికి $2 మిలియన్లు (సుమారు రూ.17 కోట్లు) అందుతాయి. అలాగే $126 మిలియన్ల విలువైన స్టాక్ యూనిట్లు కూడా లభిస్తాయి. కంపెనీ పనితీరు (S&P 100 తో పోలిస్తే) అద్భుతంగా ఉంటే, ఇది రెట్టింపు అయి $252 మిలియన్లకు చేరుతుంది. కంపెనీలో కొనసాగుతున్నందుకు గానూ మరో $84 మిలియన్ల విలువైన షేర్లు నెలవారీగా ఆయన ఖాతాలో జమ అవుతాయి. గూగుల్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులైన ‘వేమో’ (సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు), ‘వింగ్’ (డ్రోన్ డెలివరీ) వృద్ధికి అదనంగా $350 మిలియన్ల స్టాక్ ఇన్సెంటివ్లను జత చేసింది. ఇదే సమయంలో పిచాయ్ తనకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తే, ఆయన మొత్తం సంపాదన గరిష్టంగా $692 మిలియన్లకు చేరుతుంది. లక్ష్యాలు చేరకపోతే ఈ అదనపు ప్రయోజనాలు ఏవీ లభించవు.
పిచాయ్ హయాంలో గూగుల్ ప్రస్థానం..
2015 ఆగస్టులో సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టినప్పుడు గూగుల్ మార్కెట్ విలువ $535 బిలియన్లు. నేడు అది $3.6 ట్రిలియన్లకు (జనవరిలో $4 ట్రిలియన్లు దాటింది) చేరుకుంది. అంటే దాదాపు 7 రెట్లు వృద్ధి సాధించింది. ఇదే సమయంలో గూగుల్ AI రేసులో కూడా పుంజుకుంది. మొదట్లో ChatGPT రాకతో గూగుల్ వెనకబడిందనే విమర్శలు వచ్చినా, పిచాయ్ తనదైన శైలిలో ‘Gemini’ వంటి AI మోడళ్లను ప్రవేశపెట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్ను మరింత శక్తివంతం చేశారు. 2004లో క్రోమ్ బ్రౌజర్ డెవలపర్గా చేరిన పిచాయ్, నేడు తన కష్టార్జితంతో బిలియనీర్ల జాబితాలో చేరారు. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. సుందర్ పిచాయ్, ఆయన భార్య అంజలి పిచాయ్ వద్ద ప్రస్తుతం 1.67 మిలియన్ గూగుల్ షేర్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ సుమారు $498 మిలియన్లు (దాదాపు రూ.4,100 కోట్లు). అంతేకాకుండా, పిచాయ్ వ్యక్తిగత భద్రత కోసం గూగుల్ 2024లో $8.3 మిలియన్లు ఖర్చు చేయడం గమనార్హం. అపారమైన మేధస్సు, ఓర్పుతో గూగుల్ను శిఖరాగ్రాన నిలబెట్టిన సుందర్ పిచాయ్కు ఈ ప్యాకేజీ ఒక తగిన గౌరవమని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాంటీట్రస్ట్ కేసులు, AI పోటీ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, బోర్డు ఆయనపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ ‘మెగా ఆఫర్’ ఇచ్చింది.