దేశీయ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మునుపెన్నడూ లేనంతంగా భారీ నష్టాల దిశగా సాగుతోంది. గత నెల ముగింపులో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం రెండు వారాలైనా చల్లారలేదు. రోజురోజుకు తీవ్రత పెరుగుతోంది. దీంతో చమురు ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్ భారీ నష్టాల్లోకి జారీ పోయింది. గత రెండు వారాలుగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈ వారం ముగింపులో కూడా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పోయింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 1,484 పాయింట్లు నష్టపోయి 74, 550 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 496 పాయింట్లు నష్టపోయి 23, 143 దగ్గర కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 15 నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ముడి చమురు ధరలు పెరగడం, ఎఫ్ఐఐల అమ్మకాలు, బలహీనమైన ప్రపంచ సంకేతాలు మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక రూపాయి భారీగా పతనం అయింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 92.37కి పడిపోయింది.
నిఫ్టీలో హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.. టాటా కన్స్యూమర్, హెచ్యుఎల్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్, నెస్లే లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, బ్యాంకులు, రియాల్టీ, మెటల్, మీడియా, ఫార్మా 1-3 తగ్గడంతో మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
