Stock Market Crash: షేర్ మార్కెట్లో గురువారం కుప్పకూలిపోయింది. ఈ రోజు ఉదయం నుంచే మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో స్టార్ట్ అయ్యాయి. సమయం గడిచేకొద్దీ అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 1.50 శాతం మేర నష్టపోయాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్ కంపెనీల షేర్లలో భారీగా విక్రయాలు కనిపిస్తుండగా, ఐటీ (IT) రంగానికి చెందిన షేర్లు అతలాకుతలమయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.73 శాతం (1,700 పాయింట్లకు పైగా) పతనమైంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5.7% నష్టంతో 29,338.3 పాయింట్ల వద్ద ట్రేడయ్యింది.
ఐటీ షేర్ల అతలాకుతలం:
ఈ రోజు మార్కెట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేరు గరిష్టంగా 8.74 శాతం పడిపోయి రూ.2,231 వద్దకు చేరింది. జూలై 2020 తర్వాత టాటా షేర్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. అలాగే ఇన్ఫోసిస్ షేర్లు కూడా 4.19 శాతం క్షీణించాయి. వీటితో పాటు హెచ్సీఎల్ టెక్ షేర్లు 4.84 శాతం తగ్గి రూ.1,183 వద్ద ట్రేడవుతున్నాయి. విప్రో షేరు విషయానికి వస్తే 3.67 శాతం నష్టంతో రూ.202 స్థాయికి పడిపోయింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్ 6 శాతం, కోఫోర్జ్ (Coforge) 6.30 శాతం, ఎంఫసిస్ (Mphasis) 4 శాతం నష్టంతో రూ.2,239 వద్ద, ఎల్టీఐమైండ్ట్రీ దాదాపు 8 శాతం మేర పతనమయ్యాయి.
ఐటీ కంపెనీల పతనానికి ప్రధాన కారణాలు ఇవే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత ఆటోమేషన్ వల్ల సాంప్రదాయ ఐటీ సేవల డిమాండ్ తగ్గిపోతుందనే భయాందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి దిగ్గజ షేర్లను అమ్మడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఇదే సమయంలో గత మూడు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతానికి పైగా లాభపడింది. ఈ వేగవంతమైన ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలను స్వీకరించడంతో మార్కెట్ పతనం మరింత తీవ్రమైందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్ని నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటున్నారు. గ్లోబల్ మార్కెట్లలో ఏఐ ఆధారిత అవకాశాలపై వారు దృష్టి పెట్టడం కూడా భారత ఐటీ రంగంపై అదనపు ఒత్తిడిని పెంచిందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇది మొత్తం మార్కెట్తో పాటు ఐటీ రంగాన్ని దెబ్బతీసిందని అంటున్నారు.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు (1.53%) నష్టపోయి 73,506.15 వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 323.20 పాయింట్లు (1.38%) క్షీణించి 23,160.35 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ రోజు మార్కెట్లోని అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్రేడింగ్లో ఉన్న మొత్తం 16 రంగాలు (Indices) నష్టాల్లోనే నడుస్తున్నాయి. బ్రాడర్ మార్కెట్లోనూ బలహీనత కొనసాగుతుండగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.6 శాతం, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.8 శాతం మేర నష్టపోయాయి.
