చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నా, రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, సంపాదన ఎంత అన్నది కాదు, అందులో ఎంత పొదుపు చేశామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ పసిడి బాండ్ల (SGB) ఉదాహరణే తీసుకుంటే.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన చిన్న పెట్టుబడి నేడు ఏకంగా నాలుగు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సరైన సమయంలో.. సరైన చోట డబ్బును పొదుపు చేస్తే అది కాలక్రమేణా వటవృక్షమై మనకు ఆర్థిక స్వేచ్ఛను, భద్రతను ఇస్తుంది. పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు.. అది మన సంపదను సృష్టించే ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన సార్వభౌమ పసిడి బాండ్లు (Sovereign Gold Bonds – SGB) పెట్టుబడిదారులకు కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన 5వ సిరీస్ బాండ్ల గడువు ముగియడంతో.. వాటిని వెనక్కి తీసుకునే (Redemption) ధరను ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ బాండ్ల తుది విక్రయ ధరను గ్రాముకు రూ. 15,009గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల క్రితం (అక్టోబర్ 2019లో) ఈ బాండ్లను జారీ చేసినప్పుడు గ్రాము ధర కేవలం రూ. 3,788 మాత్రమే. అంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు ఒక గ్రాముపై ఏకంగా రూ. 11,221 లాభం వచ్చింది. ఇది దాదాపు 300 శాతానికి పైగా లేదా సుమారు 4 రెట్ల రాబడి.
రిడంప్షన్ ధరను ఎలా లెక్కిస్తారు?
ఈ ధరను నిర్ణయించడానికి ఆర్బీఐ ఒక పద్ధతిని అనుసరిస్తుంది. బాండ్ గడువు ముగిసే తేదీకి ముందు ఉన్న చివరి మూడు పని దినాలలో (Working Days) మార్కెట్లో ఉన్న బంగారం సగటు ధరను (IBJA రేట్ల ప్రకారం) పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన ఏప్రిల్ 2026 నాటి ధరలను బట్టి ఈ భారీ రేటు ఖరారైంది.
అదనపు ప్రయోజనాలు..
కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభమే కాకుండాజజ ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులు మరిన్ని ప్రయోజనాలు పొందారు. వాటిలో ముఖ్యంగా వార్షిక వడ్డీ. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంపై ప్రతి ఏటా 2.5 శాతం వడ్డీ లభించింది. ఇది నేరుగా పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. గడువు ముగిసే వరకు బాండ్లను ఉంచుకుంటే.. వాటిపై వచ్చే లాభాల (Capital Gains) మీద ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
భౌతిక బంగారంతో పోలిస్తే వీటిని భద్రపరిచే టెన్షన్ ఉండదు.. నాణ్యత విషయంలో ఎటువంటి మోసాలకు అవకాశం ఉండదు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో.. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించే ఎస్జీబీలు స్టాక్ మార్కెట్ కంటే మెరుగైన రాబడులను అందించాయి. ఎనిమిదేళ్ల క్రితం ఓపికగా పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయించిన ఈ ధర ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చు.
