Gautam Adani: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. అదానీకి సెబీ క్లీన్‌చిట్..

  • అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు..
  • ఆర్థిక అవకతవకలు జరగలేదని సెబీ క్లీన్‌చిట్..
Gautam Adani

Gautam Adani

Gautam Adani: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ , అదానీ పవర్ వంటి అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తోసిపుచ్చింది. జనవరి 2023లో, అదానీ గ్రూప్ సంస్థల మధ్య డబ్బుల్ని మళ్లించడానికి అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్, రెహ్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

Read Also: Singareni : అధికారుల నిర్లక్ష్యం.. సింగరేణిలో మరో ప్రమాదం

అయితే, ఈ ఆరోపణల్ని విచారించిన సెబీ, అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, మార్కెట్‌ మ్యానిపులేషన్‌, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది. అదానీ గ్రూప్ కంపెనీ లావాదేవీల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని సెబీ బోర్డు సభ్యుడు కమెలేష్ సీ వార్ష్నీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పింది. అదానీ గ్రూపుపై ఎలాంటి జరిమానా విధించాల్సిన అవసరం లేదని తెలిపింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 150 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయారు. సెబీ క్లీన్‌చిట్‌కు ముందు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా అదానీ గ్రూప్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీంతో మళ్లీ షేర్లు పుంజుకున్నాయి.