రూపాయిల కరెంటు బిల్లు కట్టబోయి ఏకంగా రూ. 1.99 లక్షలు పోగొట్టుకున్న ఒక ఎస్బీఐ (SBI) ఖాతాదారుడికి వినియోగదారుల కోర్టులో న్యాయం జరిగింది. బెంగళూరుకు చెందిన ప్రదోష్ కుమార్ అనే వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవం, ఆ తర్వాత ఆయన సాగించిన పోరాటం గురించి తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
2022 జూలైలో ప్రదోష్కు ఒక ఎస్సెమ్మెస్ (SMS) వచ్చింది. “మీ కరెంటు బిల్లు కట్టలేదు, వెంటనే కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం” అన్నది ఆ మెసేజ్లో ఉంది. భయపడిన ఆయన, ఆ మెసేజ్లో ఉన్న నంబర్కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లుగా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుని, కేవలం 20 రూపాయల బిల్లు కట్టడానికి ప్రయత్నించారు. అంతే.. వెంటనే ఆయన ఖాతా నుంచి మొదట రూ. 25,000, ఆ తర్వాత రూ. 1.99 లక్షలు కట్ అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు ఎలాంటి ఓటీపీ (OTP) రాలేదు.
ఖాతాదారుడి పోరాటం..
డబ్బులు పోయిన వెంటనే ప్రదోష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అదే రోజు ఎస్బీఐ హెల్ప్లైన్ , ఈమెయిల్ ద్వారా బ్యాంకుకు సమాచారం అందించారు. బ్యాంకు స్పందించి మొదట కట్ అయిన రూ. 25,000 తిరిగి ఇచ్చింది కానీ.. పెద్ద మొత్తమైన రూ. 1.99 లక్షలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఖాతాదారుడి తప్పిదం వల్లే డబ్బులు పోయాయని వాదించింది.
కోర్టు తీర్పు..
ఈ కేసు జాతీయ వినియోగదారుల కమిషన్ (NCDRC) వద్దకు చేరింది. విచారణ జరిపిన కోర్టు బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. మోసం జరిగిన వెంటనే (మూడు రోజులలోపు) బ్యాంకుకు సమాచారం ఇస్తే.. ఆ నష్టానికి ఖాతాదారుడు బాధ్యుడు కాదని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. కేవలం ఒక యాప్ డౌన్లోడ్ చేసినంత మాత్రాన అది ఖాతాదారుడి నిర్లక్ష్యం కాదని స్పష్టం చేసింది. బాధితుడికి పోయిన రూ. 1.99 లక్షలతో పాటు, అదనంగా రూ. 25,000 పరిహారం చెల్లించాలని ఎస్బీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లోపు ఈ డబ్బులు చెల్లించకపోతే.. 8 శాతం వడ్డీ కూడా కట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు, మోసం జరిగితే వెంటనే స్పందిస్తే న్యాయం జరుగుతుందని ఈ తీర్పు నిరూపించింది.
