Site icon NTV Telugu

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు

SBI

SBI

కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జ‌న‌వ‌రి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్ర‌వ‌రి మాసం ప్రారంభం కానుంది.. ఇప్ప‌టికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీల‌ను అమ‌లు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ఛార్జీలను పెంచ‌బోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్‌ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వ‌డ్డించ‌నుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టుగా చెబుతున్నారు.

Read Also: 75 శాతం మంది పెద్ద‌ల‌కు వ్యాక్సినేష‌న్‌.. ప్ర‌ధాని అభినంద‌న‌లు..

కాగా, ఎస్బీఐ.. యోనో బ్యాంకింగ్‌ ద్వారా చేసే రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్‌ సేవలకు ఎలాంటి సర్వీస్‌ ఛార్జ్‌, జీఎస్టీ వర్తించ‌ద‌ని తెలిపింది.. కానీ, బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్‌ లావాదేవీలకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ఐఎంపీఎస్‌ ఛార్జీని అమలు చేయ‌బోతోంది.. అంటే, ఐఎంపీఎస్‌ ద్వారా ఖాతాదారులు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పంపితే.. 20 రూపాయ‌ల‌తో పాటు అద‌నంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.. ఐఎంపీఎస్‌ లావాదేవీల్లో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ.2తో పాటు జీఎస్టీ అధినంగా చెల్లించాల్సి ఉండ‌గా.. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు లావాదేవీపై రూ. 4తో పాటు జీఎస్టీ, రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీ అద‌నంగా వ‌సూలు చేస్తోంది.. ఇక‌, కొత్త స్లాబ్ ప్రకారం.. రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంద‌ని ఎస్బీఐ పేర్కొంది. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ అంటే.. ఎల్లుండి నుంచి ఇది అమ‌ల్లోకి రాబోతోంది.

Exit mobile version