జూన్ నెల మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. జూలై నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మాదిరిగానే, ఈసారి కూడా జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, సేవా రంగాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆధార్ అప్డేట్లు, రైల్వే జరిమానాలు, బ్యాంకు ఎఫ్డీలు, క్రెడిట్ కార్డులు, ఎల్పీజీ ధరలు, విమాన ప్రయాణ ఖర్చులు వంటి అంశాల్లో వచ్చే మార్పులు నేరుగా సామాన్యుల జీవితంపై ప్రభావం చూపనున్నాయి.
ఆధార్లో ఇమెయిల్ అప్డేట్ ఉచితం
భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఇమెయిల్ చిరునామాను లింక్ చేయడం లేదా అప్డేట్ చేయడం కోసం ఇప్పటివరకు వసూలు చేస్తున్న రూ.75 ఫీజును ఆరు నెలల పాటు మాఫీ చేసింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా
రైల్వే శాఖ ప్రయాణికుల క్రమశిక్షణ కోసం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిపై కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే ఇతరుల టిక్కెట్లతో ప్రయాణించడం, మహిళల బోగీల్లో అక్రమంగా ప్రవేశించడం, రైళ్లలో గొడవలు సృష్టించడం, భిక్షాటన లేదా అనధికారిక విక్రయాలు చేయడం వంటి చర్యలపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
బ్యాంక్ FD వడ్డీ రేట్లలో మార్పులు
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన నిర్ణయాల నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. కొత్తగా FD పెట్టే వారు లేదా ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్ధరించే వారు తాజా వడ్డీ రేట్లను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ రివార్డ్స్పై పరిమితులు
ఎస్బిఐ కార్డ్స్ తన ప్రీమియం క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లకు నెలవారీ పరిమితిని అమలు చేయనుంది. ఫోన్పే ఎస్బిఐ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ వంటి కార్డుల వినియోగదారులు కొన్ని లావాదేవీలపై ఇప్పటివరకు పొందుతున్న రివార్డ్స్ను ఇకపై పొందలేకపోవచ్చు.
LPG ధరలపై కీలక నిర్ణయం
ప్రతి నెల మాదిరిగానే జూలై 1న కూడా చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించనున్నాయి. ఇటీవల గృహ వినియోగ 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులు కొత్త ధరలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా కొత్త ధరలు నిర్ణయించనున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల అవకాశం
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెల మొదటి తేదీన ఇంధన ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండవచ్చని వినియోగదారులు ఆశిస్తున్నారు. అయితే తుది నిర్ణయం చమురు కంపెనీల సమీక్షపై ఆధారపడి ఉంటుంది.
విమాన ఛార్జీలపై ప్రభావం చూపనున్న ATF ధరలు
విమాన ఇంధనం (ATF) ధరల నెలవారీ సమీక్ష కూడా జూలై 1న జరగనుంది. ATF ధరల్లో మార్పులు జరిగితే దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదనంగా డీజిల్, ATFపై విధించే ఎగుమతి సుంకాలను కూడా ప్రభుత్వం సమీక్షించనుంది.
HDFC క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు
HDFC బ్యాంక్ తన ప్రముఖ క్రెడిట్ కార్డులైన రెగాలియా గోల్డ్, డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ కార్డుల నిబంధనలను సవరించనుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయాల కోసం కొత్త అర్హత ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో తరచూ విమాన ప్రయాణాలు చేసే కార్డ్ హోల్డర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులు సామాన్య ప్రజల ఖర్చులు, పెట్టుబడులు, ప్రయాణాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. అందువల్ల కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

