Ratan Tata: రతన్ టాటా మరణానంతరం ఆయన వారసత్వానికి సంబంధించిన అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. టాటా సన్స్లో ఆయనకు ఉన్న సుమారు రూ.10,000 కోట్ల విలువైన షేర్లపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ తీసుకున్న నిర్ణయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదానికి ప్రధాన కారణం.. రతన్ టాటా తండ్రి నవల్ టాటా గతంలో పెట్టిన కొన్ని కీలక షరతులేనని సమాచారం.
అసలు వివాదం ఏంటంటే..
1989లో నవజ్బాయి రతన్ టాటా ట్రస్ట్ (NRTT) తన వాటాలను నవల్ టాటాకు బదిలీ చేసింది. అయితే ఈ బదిలీకి కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించారు. ప్రముఖ న్యాయవాది నానీ పాల్ఖివాలా సూచనల మేరకు రూపొందించిన ఈ షరతుల ప్రకారం.. నవల్ టాటా తన జీవితకాలంలో ఆ వాటాలను బయటి వ్యక్తులకు బదిలీ చేయకూడదు. వాటాలను ఇవ్వాల్సి వస్తే భార్య లేదా పిల్లలకు మాత్రమే ఇవ్వాలి. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ఇదే నిబంధన ఆయన పిల్లలకు కూడా వర్తించేలా ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంటే వారు కూడా ఆ వాటాలను కుటుంబ సభ్యులకు మాత్రమే బదిలీ చేయాలి. టాటా సన్స్లోని షేర్లు టాటా కుటుంబ పరిధిలోనే ఉండేలా చూడటమే ఈ నిబంధనల ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
రతన్ టాటా వీలునామాతో చిక్కు
రతన్ టాటా తన వీలునామాలో టాటా సన్స్లోని 0.83 శాతం వాటాలను రెండు స్వచ్ఛంద సంస్థలకు కేటాయించారు. అవి రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ (RTET), రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF). ఈ వాటాల ప్రస్తుత విలువ రూ.10,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే ఈ వాటాలను కుటుంబానికి చెందని సంస్థలకు బదిలీ చేయడం నవల్ టాటా ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధమా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ అమోఘ్ కలోటి నిర్ణయం తర్వాత ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని భావిస్తే NRTT ట్రస్టీలు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు NRTT ట్రస్టీలు రతన్ టాటా వీలునామా ఎగ్జిక్యూటర్లను సంప్రదించే అవకాశం ఉంది. NRTT ట్రస్టీలలో నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఉన్నారు. మరోవైపు రతన్ టాటా తన వీలునామా అమలుకు డారియస్ ఖంబట్టా, మెహ్లీ మిస్త్రీ, షిరిన్ జెజీభోయ్ తదితరులను ఎగ్జిక్యూటర్లుగా నియమించారు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం వరకు తీసుకెళ్లకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
న్యాయ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు
ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. నవల్ టాటా అంగీకరించిన షరతులు ఆయనకు మాత్రమే కాకుండా, ఆ ఆస్తిని పొందిన తర్వాత ఆయన పిల్లలకు కూడా వర్తిస్తాయని ఒక వర్గం వాదిస్తోంది. మరోవైపు, రతన్ టాటా వీలునామాను రూపొందించిన న్యాయవాది మాత్రం ఆ షేర్లను వ్యక్తులకు కాకుండా స్వచ్ఛంద సంస్థలకు కేటాయించినందున, వీలునామా చెల్లుబాటు అవుతుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో రతన్ టాటా వీలునామా, నవల్ టాటా పాత ఒప్పందంలోని నిబంధనల మధ్య ఉన్న ఈ విభేదం ఎలా పరిష్కారమవుతుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

