ప్రస్తుతం వంటగ్యాస్ (LPG) ధరలు పెరగడం.. సరఫరాలో ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో.. ప్రజలను పైపుల ద్వారా అందే గ్యాస్ (PNG) వైపు ఆకర్షించేందుకు గ్యాస్ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సిలిండర్ల కోసం నిరీక్షించే అవసరం లేని, సురక్షితమైన.. నిరంతరాయంగా అందే PNG సేవలను ప్రోత్సహించేందుకు ఈ సంస్థలు పలు రాయితీలను అందిస్తున్నాయి.
గ్యాస్ సంస్థల ప్రత్యేక ఆఫర్లు ఇవే..
మార్చి 31వ తేదీలోపు కొత్తగా PNG కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే గృహ వినియోగదారులకు గెయిల్ (GAIL), ఇంద్రప్రస్థ గ్యాస్ (Indraprastha Gas) సంస్థలు దాదాపు రూ.500 విలువైన ఉచిత గ్యాస్ను బహుమతిగా అందించనున్నాయి.
మహానగర్ గ్యాస్ సంస్థ గృహ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ500 రిజిస్ట్రేషన్ ఫీజును ఈ ఆఫర్ కాలంలో పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాణిజ్య అవసరాల కోసం కమర్షియల్ కనెక్షన్లు తీసుకునే వారికి భారీ ఊరట లభించనుంది. మహానగర్ గ్యాస్ సంస్థ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉండే సెక్యూరిటీ డిపాజిట్ను పూర్తిగా రద్దు చేసింది. దీనికి తోడు, బిపిసిఎల్ (BPCL) కూడా కమర్షియల్ కనెక్షన్లపై ‘జీరో డిపాజిట్’ పథకాన్ని అమలు చేస్తోంది.
Also Read:Heavy Rain In Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..
ఈ కనెక్షన్ల ద్వారా సిలిండర్ అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. పైపులైన్ ద్వారా 24/7 గ్యాస్ అందుబాటులో ఉంటుంది. సిలిండర్ల నిల్వతో ఉండే ప్రమాదాలు (లీకేజీలు) PNGలో చాలా తక్కువ. ఆధునిక స్మార్ట్ మీటర్ల ద్వారా గ్యాస్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు మనం ట్రాక్ చేయవచ్చు. క్రమపద్ధతిలో గ్యాస్ వాడకం జరగడం వల్ల అనవసర వృధా తగ్గుతుంది. అంతే కాకుండా.. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాలు కూడా PNG వినియోగదారులకు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు అన్నీ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు నివసిస్తున్న ప్రాంతంలో PNG పైపులైన్ సౌకర్యం ఉందో లేదో సంబంధిత గ్యాస్ సంస్థ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు వెంటనే దగ్గరలోని గ్యాస్ డీలర్ కార్యాలయాన్ని లేదా సంబంధిత కంపెనీ వెబ్సైట్ను సంప్రదించి.. మార్చి 31లోపు మీ అప్లికేషన్ను సమర్పించడం మంచిది. ఈ ఆఫర్లు సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి కాబట్టి.. దరఖాస్తు చేసేటప్పుడు పూర్తి వివరాలను అడిగి తెలుసుకోండి.
ఇదిలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు పోకుండా చూడాలని కంపెనీల అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి, స్కూల్స్, ఆలయాలకు గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఎల్పీజీకి బదులుగా ఇండక్షన్ స్టవ్, పైప్డ్ గ్యాస్ వినియోగించేలా చేయాలన్నారు. ఎల్పీజీ వాడకాన్ని తగ్గించేలా హోటల్స్ యజమానులతో చర్చించాలని అధికారులను సూచించారు.
