PM Surya Ghar Yojana: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా మారుతోంది. పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. తాజాగా అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా 55.82 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఆయా ఇళ్లలో కరెంట్ బిల్లులు గణనీయంగా తగ్గుతున్నాయి.
ఈ పథకంపై ప్రధాని ప్రశంసలు
గుజరాత్లోని వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం సూర్య ఘర్ పథకం ప్రగతిని ప్రస్తావించారు. ప్రజలు కేవలం విద్యుత్ వినియోగదారులుగా ఉండకుండా.. తమ ఇళ్లలోనే విద్యుత్ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా గుజరాత్లోనే భారీ సంఖ్యలో కుటుంబాలు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం పెద్ద విజయమని అన్నారు. ఈ పథకం వల్ల కేవలం విద్యుత్ ఖర్చులు తగ్గడం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. సోలార్ ప్యానెళ్ల తయారీ, ఇన్స్టాలేషన్, వాటి నిర్వహణ, సర్వీసింగ్ వంటి రంగాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో యువతకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. సోలార్ రంగంలో కొత్త విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు మార్కెట్లోకి వస్తున్నారు.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సౌర విద్యుత్
ఈ పథకం అమలులో గుజరాత్ ముందంజలో ఉంది. రాష్ట్రంలో 8.33 లక్షలకు పైగా సోలార్ ఇన్స్టాలేషన్లు పూర్తయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీటి ద్వారా సుమారు 3,123 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో సుమారు రూ.6,030 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 46.94 లక్షలకు పైగా ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయి. వీటి ద్వారా దేశ విద్యుత్ గ్రిడ్కు 16,530 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ సామర్థ్యం జత అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగం కూడా పెరుగుతోంది. సోలార్ ప్యానెళ్ల తయారీ నుంచి ఇన్స్టాలేషన్, నిర్వహణ వరకు అనేక రంగాలకు ఈ పథకం ఊతమిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

