భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా గత కొంతకాలంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు తిరిగి కోలుకుంటూ ‘రిలీఫ్ ర్యాలీ’ దిశగా పయనిస్తున్నాయని ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (CIO) మనీష్ సొంతాలియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 నేడు 24,000 మార్కును దాటేసింది. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మినహా భారత మార్కెట్లు బేరిష్ (నష్టాల) వైపు వెళ్లడానికి పెద్దగా బలమైన కారణాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఒడిదుడుకులు ఎదురైనా నిఫ్టీ 22,000 మార్కును దాటి కిందకు పడిపోయే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, విస్తృత మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మార్కెట్ ఇప్పటికే అంచనా వేసిందని సొంతాలియా పేర్కొన్నారు. ఒకవేళ ఈ సంక్షోభం త్వరగా ముగిసిపోతే, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. “మేము ఇప్పటికే దాదాపుగా ఈ త్రైమాసిక ఫలితాల ముగింపు దశకు చేరుకున్నాం. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికాన్ని పరిశీలిస్తే, నిఫ్టీ 500 ఇండెక్స్లోని సుమారు 44-45 శాతం కంపెనీలు తమ ఆదాయ వృద్ధి 25 శాతం కంటే ఎక్కువగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి” అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రివర్సల్ జోన్ ..
మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఒకానొక సమయంలో 2027 ఆర్థిక సంవత్సర ఆదాయాలపై 10 నుంచి 12 శాతం ప్రతికూల ప్రభావం పడుతుందని మార్కెట్ భావించింది. అయితే, ప్రస్తుతానికి ఈ సంక్షోభం మరింత ఉధృతం కాకుండా అదుపులోనే ఉండటం, శాంతి ప్రయత్నాలు ప్రారంభం కావడంతో ఈ అంచనాలను సవరించాల్సి ఉంటుందని సొంతాలియా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలు 12-13 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.
మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతల వల్ల కొన్ని రంగాలు తమ ప్రాథమిక విలువల కంటే చాలా కిందకు పడిపోయాయని, ఇప్పుడు జరుగుతున్న రికవరీ వాటిని మళ్లీ పుంజుకునేలా చేస్తోందని ఆయన వివరించారు. గ్లోబల్ మార్కెట్లలో మళ్లీ స్థిరత్వం వస్తోందని హర్షం వ్యక్తం చేసినప్పటికీ, కంపెనీల నుంచి మరింత బలమైన ఆదాయ ఫలితాలు రానంత వరకు నిఫ్టీ 25,000 మార్కును దాటి భారీగా లాభపడటం కూడా కష్టమేనని మనీష్ సొంతాలియా హెచ్చరించారు. కేవలం సెంటిమెంట్తోనే మార్కెట్ తదుపరి రికార్డులను సృష్టించలేదని, దానికి కార్పొరేట్ వృద్ధి తోడవాలని ఆయన స్పష్టం చేశారు.
