Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు

Petrol

Petrol

దేశవ్యాప్తంగా ఇంధన వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటూ ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పెట్రోల్ లీటరుకు రూ.5, డీజిల్ లీటరుకు రూ.3 తగ్గించనున్నట్లు సంస్థ ప్రకటించింది. రెండేళ్లకు పైగా కాలంలో ఏ ఇంధన సంస్థ రిటైల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో నిర్ణయం

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కీలక సముద్ర మార్గాలు తిరిగి తెరుచుకోవడం వల్ల ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గి అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే నయారా ఎనర్జీ ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కొత్త ధరలు అమలు

నయారా ఎనర్జీకి చెందిన దేశవ్యాప్తంగా 7,000కు పైగా ఫ్యూయల్ స్టేషన్లలో సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ట్రాల వారీగా వ్యాట్ (VAT), ఇతర స్థానిక పన్నుల ఆధారంగా పంపు వద్ద వినియోగదారులు చెల్లించే ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ప్రభుత్వ రంగ కంపెనీల్లో మార్పు లేదు

మరోవైపు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుతం తమ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశంలోని 90 శాతానికి పైగా ఇంధన పంపులను నిర్వహిస్తున్న ఈ సంస్థలు పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో IOC అవుట్‌లెట్లలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12, డీజిల్ ధర రూ.95.20గా కొనసాగుతోంది.

మార్చిలో పెంచి.. ఇప్పుడు తగ్గింపు

ఇరాన్-పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగిన సమయంలో మార్చి 26న నయారా ఎనర్జీ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 ధరలను పెంచింది. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మే నెలలో దశలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలను మొత్తం రూ.7.50 వరకు పెంచాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడటంతో నయారా మళ్లీ అదే మొత్తాన్ని తగ్గిస్తూ వినియోగదారులకు ఉపశమనం కల్పించింది.

డిమాండ్‌కు పూర్తిగా సిద్ధం

గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీ నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, రిఫైనరీ నిర్వహణ పనులు పూర్తయ్యాయని, దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు తమ నెట్‌వర్క్ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపింది.