Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్‌డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..

  • మోడీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
  • ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 'లాక్‌డౌన్' తరహా ఆంక్షలు..
  • ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశం
Modi

Modi

Cost Cutting: దేశంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు నిరంతరం పెరుగుతుండటం.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు తమ అనవసర ఖర్చులను తక్షణమే తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక శాఖ..
సోమవారం ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వంటి దిగ్గజ ప్రభుత్వ ఆర్థిక సంస్థలన్నింటికీ వర్తిస్తాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఛైర్మన్‌, ఎండీ, సీఈఓలతో పాటు ఇతర ఉన్నతాధికారుల విదేశీ ప్రయాణాలను గరిష్టంగా తగ్గించాలి. నిర్దేశించిన పరిమితులకు లోబడి మాత్రమే ప్రయాణాలు ఉండాలి. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ కార్యక్రమాలకు వర్చువల్‌గానే హాజరు కావాలి. ఫిజికల్‌గా హాజరు కచ్చితంగా అవసరమైతే తప్ప.. అన్ని రకాల అంతర్గత సమావేశాలు, ప్రాజెక్టు సమీక్షలు, సూచనలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే నిర్వహించాలి. అన్ని ప్రభుత్వ ఆర్థిక సంస్థల ప్రధాన కార్యాలయాలు, బ్రాంచ్‌లలో ప్రస్తుతం అద్దెకు తీసుకున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వీలైనంత త్వరగా విద్యుత్ వాహనాలను (EVs) వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

కోవిడ్ రోజులను గుర్తు చేసిన ప్రధాని
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన దిగ్బంధనం కారణంగా అత్యధికంగా చమురు దిగుమతులపై ఆధారపడే ఇండియాపై ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశ విదేశీ మారక నిల్వలను దెబ్బతీస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గతంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీసుకున్నటువంటి కఠిన చర్యలను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ అమలు చేయాలని కోరారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలను తిరిగి స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి
మెట్రో సౌకర్యం ఉన్న నగరాల్లో నివసించే ప్రజలు ప్రైవేట్ వాహనాలను పక్కన పెట్టి, మెట్రో – బస్సులు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. అలాగే కనీసం ఒక సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. దేశ విదేశీ మారక నిల్వలను పరిరక్షించేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని చెప్పారు. భారతదేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఇంధన వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవచ్చని, దీనికి ప్రతి పౌరుడి సహకారం అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్లక్ష్యం వహించకుండా ఈ వ్యయ నియంత్రణ చర్యలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఉన్నతాధికారులను తాజా ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.