Mobile Recharge Controversy: భారతదేశ టెలికాం రంగంలో ప్రీపెయిడ్ ప్లాన్ల గడువుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. సామాన్య ప్రజలపై పడుతున్న అదనపు భారానికి వ్యతిరేకంగ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ఈ విధానం వినియోగదారులను దోపిడీ చేయడమేనని ఆయన అభివర్ణించారు. సాధారణంగా మనం నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటామని భావిస్తాం. కానీ, భారతదేశంలోని మెజారిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు 28 రోజుల చెల్లుబాటుతోనే వస్తున్నాయి. దీని వల్ల కలిగే నష్టం ఏమిటంటే.. 28 రోజుల చొప్పున 13 సార్లు రీఛార్జ్ చేస్తే (28 * 13 = 364) రోజులు అవుతుంది. అంటే ఒక ఏడాది పూర్తి కావడానికి వినియోగదారుడు 12 సార్లు కాకుండా, 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక ప్లాన్ను ‘నెలవారీ ప్లాన్’ అని పిలిచినప్పుడు, దాని గడువు కచ్చితంగా 30 లేదా 31 రోజులు ఉండాలని, అప్పుడే అది వినియోగదారులకు పారదర్శకంగా ఉంటుందని రాఘవ్ చద్దా వాదించారు.
READ ALSO: Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాకుండా, రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ను బ్లాక్ చేయడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవుట్గోయింగ్ కాల్స్ ఆపివేయడం సమంజసమే అయినా, ఇన్కమింగ్ కాల్స్ ఆపేయడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నేటి కాలంలో బ్యాంకింగ్ లావాదేవీలకు, OTPలకు, ప్రభుత్వ సేవల సమాచారానికి మొబైల్ నంబర్ ప్రాణాధారం అని అన్నారు. ఇన్కమింగ్ ఆగిపోతే పేద ప్రజలు, నిరుద్యోగులు కమ్యూనికేషన్ కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో పడుతున్నారని ఆయన వివరించారు. టెలికాం ఆపరేటర్లు తమ బిల్లింగ్ వ్యవస్థల సౌలభ్యం కోసం 28 రోజుల ప్లాన్లను (కచ్చితంగా 4 వారాలు) ఉపయోగిస్తామని చెబుతుంటారు. అయితే, ఈ పద్ధతి ద్వారా కంపెనీలకు ఏటా కోట్లాది రూపాయల అదనపు ఆదాయం సమకూరుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం.. కంపెనీలు కనీసం ఒక ప్లాన్ నైనా 30 రోజుల గడువుతో అందించాలి. కానీ, ఇప్పుడు ఉన్న ప్లాన్లన్నీ 28 రోజులవే కావడంతో సామాన్యులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రీఛార్జ్ ప్లాన్లను క్యాలెండర్ నెలల ప్రాతిపదికన (30 రోజులు) మార్చాలని, సామాన్యుల ప్రయోజనాలను కాపాడాలని పార్లమెంటులో రాఘవ్ చద్దా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.
READ ALSO: Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు
