దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ (LIC) షేర్లు ఒక్కసారిగా దాదాపు 50 శాతం పడిపోయి రూ.823 నుంచి రూ.414 స్థాయికి చేరాయి. అయితే, ఈ పతనం వల్ల పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం 1:1 బోనస్ షేర్ల జారీ. ఎల్ఐసీ తమ వాటాదారులకు తొలిసారిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది.
అంటే, ఒక షేర్ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి అదనంగా మరో షేర్ ఉచితంగా లభిస్తుంది. మే 29న LIC షేర్లు ఎక్స్-బోనస్గా ట్రేడ్ కావడం వల్లే షేర్ ధర సర్దుబాటు చెంది సగానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. అందువల్ల, షేర్ ధరలో కనిపిస్తున్న ఈ తగ్గుదల కంపెనీ విలువ తగ్గిందని కాదు. ఇది కేవలం బోనస్ షేర్ల సర్దుబాటు కారణంగా జరిగిన సాంకేతిక మార్పు మాత్రమే.
బోనస్ ఇష్యూ కోసం మే 29 రికార్డ్ డేట్
ఎల్ఐసీ ఈ బోనస్ షేర్ల జారీని ఏప్రిల్లో ప్రకటించింది. కంపెనీ బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. బోనస్ షేర్లకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు మే 29ను రికార్డ్ డేట్గా నిర్ణయించింది. అంటే, మే 29 నాటికి LIC షేర్లు కలిగి ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి ఒక్కో షేర్కు మరో బోనస్ షేర్ లభిస్తుంది.
ప్రభుత్వ వాటాల విక్రయ వార్తల ప్రభావం
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో మరో 2 శాతం విక్రయించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు కూడా షేర్పై ఒత్తిడిని పెంచాయి. ఈ వార్తల నేపథ్యంలో LIC షేర్లు దాదాపు 3 శాతం పడిపోయి రూ.830 వద్ద ముగిశాయి.
LIC ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయన్న నిపుణులు
మార్కెట్ నిపుణుడు, యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా మాట్లాడుతూ, LIC సంస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ (డిస్ఇన్వెస్ట్మెంట్) వార్తలు సమీప భవిష్యత్తులో స్టాక్పై కొంత ఒత్తిడిని తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
