దేశంలోకి వెండి దిగుమతులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమల్లోకి వచ్చేలా వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇకపై వ్యాపారులు విదేశాల నుండి వెండిని భారతదేశంలోకి తీసుకురావాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ పొందడం తప్పనిసరి.
ఇంతకుముందు ఆర్బీఐ నిబంధనలకు లోబడి వెండి దిగుమతులకు స్వేచ్ఛ ఉండేది. కానీ తాజా మార్పులతో దీనిని ‘ఉచితం’ (Free) కేటగిరీ నుంచి ‘నియంత్రిత’ (Restricted) కేటగిరీలోకి మార్చారు. బరువులో 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలతో పాటు, బంగారం మరియు ప్లాటినం పూత పూసిన వెండి కడ్డీలకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల దేశంలోకి వచ్చే వెండి పరిమాణాన్ని ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోనుంది.
ఇటీవల మే 13న కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జరిగిన కొద్ది రోజులకే ఈ కొత్త ఆంక్షలు విధించడం గమనార్హం. కేవలం పన్నులు పెంచడమే కాకుండా, వెండి దిగుమతులను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వ్యూహాత్మక అడుగు వేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు వరుస నిర్ణయాల వల్ల దేశీయ మార్కెట్లో వెండి లభ్యత తగ్గి, స్వల్పకాలంలో దాని ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం వెండి వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు మరియు పారిశ్రామిక కొనుగోలుదారులపై తక్షణమే పడనుంది.
