Site icon NTV Telugu

Privatisation: ఐడీబీఐ ప్రైవేటీకరణ.. ఆసక్తిదారుల కోసం రోడ్‌షోలు..

దేశంలో ప్రైవేటీకరణల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్ని సంస్థలు, బ్యాంకులను విలీనం చేసిన ప్రభుత్వం.. మరికొన్ని సంస్థలను, బ్యాంకులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది.. ఇక, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. అందులో భాగంగా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరడ్‌ వెల్లడించారు.. ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. కాగా, ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ, కేంద్రానికి కలిపి 95 శాతం వాటా ఉంది.. అయితే, ఇందులో ఎవరి వాటాలను ఎంత విక్రయించాలి అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు భగవత్‌ కరడ్.

Read Also: Navjot Singh Sidhu: సిద్ధూను వెంటాడుతోన్న 34 ఏళ్ల నాటి కేసు..!

కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్‌ ప్రమోటర్‌ షేర్‌హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలుకలిగిఉన్నారు.. ఇందులోని ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి వీలుగా ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లలో భేటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ వాటా విక్రయ సమయంలో ప్రస్తుత ఉద్యోగులు, వాటాదారులకు సరైన న్యాయం చేస్తామన్నారు. కీలకమైన వీటికి సంబంధించిన ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 51 శాతం కంటే వాటాలను తగ్గించుకోబోమని ఎన్‌డీఏ ప్రభుత్వం 2013 డిసెంబర్‌ 8న హామీ ఇచ్చింది. పార్లమెంట్‌ సాక్షిగా ఆ రోజు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని కేంద్రం ఐడీబీఐ బిల్లు 2002లో కూడా పొందుపర్చింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన హామీనే ఎన్‌డీఏ తుంగలో తొక్కుతుందని బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version