Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు

  • బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం
  • 70% తగ్గిన దిగుమతులు
  • 25-30 టన్నులకు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు
Gold

Gold

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన తర్వాత దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో నెలకు 75-100 టన్నుల వరకు దిగుమతి అయ్యే బంగారం ప్రస్తుతం 25-30 టన్నులకు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు. అంటే దిగుమతులు దాదాపు 70 శాతం వరకు తగ్గినట్లుగా అంచనా.

అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో విలువ పరంగా దిగుమతులు పెరిగాయి. 2026 మే నెలలో బంగారం దిగుమతుల విలువ గత ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరిగి 3.41 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే ఏప్రిల్-మే కాలంలో బంగారం దిగుమతుల విలువ 60.14 శాతం పెరిగి 9.04 బిలియన్ డాలర్లకు నమోదైంది.

×
×
Ad

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారం దిగుమతుల విలువ 24 శాతం పెరిగి రికార్డు స్థాయి 71.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే పరిమాణం పరంగా చూస్తే 4.76 శాతం తగ్గి 721.03 టన్నులకు పడిపోయింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారతదేశమే. దేశంలోని ఆభరణాల పరిశ్రమ అవసరాలే బంగారం దిగుమతులకు ప్రధాన కారణం. అయితే భారీ స్థాయిలో జరిగే ఈ దిగుమతులు విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతాయి.

ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ముడి చమురు, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాలు వంటి అత్యవసర దిగుమతుల కోసం వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతి వ్యయాలు మరింత పెరిగే అవకాశమున్నందున విదేశీ మారక ద్రవ్య వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.